హాట్స్పాట్గా తిరుపతి: లాక్డౌన్ పొడిగింపు..ఇంకొన్ని రోజులు నిర్బంధంలోనే: ఒక్కరోజే వెయ్యికి
తిరుపతి: ఆలయాల నగరం తిరుపతిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదా మహమ్మారి. రోజురోజుకు, గంటగంటకూ కరోనా వైరస్ తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజే 959 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. ఈ పరిణామాలతో స్థానిక అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. కేసుల్లో భారీగా పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనితో లాక్డౌన్ను పొడిగించారు.
పాతిక లక్షలకు పైగా కేసులు: అరలక్షకు చేరువగా మరణాలు: కరోనా కరాళ నృత్యం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరిశా ఉత్తర్వులను జారీ చేశారు. లాక్డౌన్ రోజుల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని గిరీశా హెచ్చరించారు. ఈ మేరకు తిరుపతి అర్బన్ పోలీసులతో సమన్వయంతో పనిచేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ హాట్స్పాట్గా మారిన నేపథ్యంలో తిరుపతిలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కిందటి నెల 21వ తేదీన లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చారు. తాజాగా దీన్ని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. మాస్కులను ధరించని వారిపై భారీగా జరిమానాలను విధిస్తున్నారు అధికారులు. అయినప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 23459కి చేరుకుంది. ఇందులో 14,093 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9131గా నమోదైంది. ఇప్పటిదాకా 235 మంది మరణించారు.
తిరుపతిలో నమోదైన కేసుల సంఖ్యే అధికంగా ఉంటోంది. అటు తిరుమలపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి ఆలయ అర్చకులు పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 750 వరకు కరోనా పాజిటివ్ కేసులు తిరుమలలో నమోదు అయ్యాయి. ఇద్దరు అర్చకులూ కన్నుమూశారు. ఈ పరిణామాలతో తిరుపతిలో లాక్డౌన్ను విధించడం వల్ల తిరుమలకు వచ్చే భక్తులనూ నియంత్రించినట్టవుతుందనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమౌతున్నాయి.