శ్రీవారిసేవలో రైల్వేమంత్రి: తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పెషల్ రెప్రజెంటేషన్
తిరుపతి: రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్.. ఈ తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఏడుకొండలవాడి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనం ముగించుకున్న అనంతరం పియూష్ గోయెల్ ఆలయం వెలుపల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ గురుమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డితో కలిసి విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభం, విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలని వేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.
కరోనా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని అన్నారు. దేశ ప్రజలందరూ సమష్ఠిగా పోరాడుతోన్నారని చెప్పారు. వేంకటేశ్వర స్వామి కృపతో త్వరలోనే ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి దేశం గట్టెక్కుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారిని దర్శించుకోవడానికి పియూష్ గోయెల్ శనివారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు బుగ్గన రాజేంద్రనాథ్, గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూధన్రెడ్డి స్వాగతం పలికారు.
షంషేర్ సింగ్ రావత్, సత్యనారాయణ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, డివిజినల్ రైల్వే మేనేజర్ అలోక్తివారి, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రత్యేక వాహనంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రాత్రి పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తన నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగిన పూర్తి చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.