తిరుమలలో అపచారం: కొండపై మాంసం తింటూ.. భద్రతపై భక్తుల అసహనం!!
తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు.
కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో తరచూ మద్యం, మాంసం తిరుమలలో మద్యం మాంసం సేవిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇక తాజాగా తిరుమలలోని షికారి వీధిలో కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో, అక్కడికి వెళ్లిన అధికారులు ఇద్దరు షికారులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి తరలించి విచారణ చేపట్టారు.
షికారీలకు మాంసం ఎక్కడినుండి వచ్చింది? ఎవరిచ్చారు? తిరుమల కొండపైకి వారి మాంసాన్ని తీసుకు వెళుతుంటే భద్రత అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఎందుకు వీరి వద్ద మాంసాన్ని గుర్తించలేదు? వంటి అనేక కోణాలలో దర్యాప్తు చేపట్టారు. ఇటువంటి ఘటనలు జరిగితే భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని, తిరుమల కొండపై పవిత్రంగా ఉండేలా చూడాలని, మద్యం, మాంసాలతో వెంకన్న కొండను అపవిత్రం చేయొద్దని పలువురు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. టిటిడి అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో తిరుమల కొండపై జరుగుతున్న అనేక ఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా స్వామివారి ఆలయం వద్ద భద్రత వైఫల్యం పై సర్వత్రా చర్చ జరిగింది. ఇక తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి సి ఎం ఓ స్టిక్కర్ వేసుకున్న ఓ ఇన్నోవా కారు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. అప్పుడు కూడా శ్రీవారి ఆలయ భద్రత ప్రమాణాల పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనలు మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు తిరుమల కొండపైన మాంసం తింటూ పట్టుబడడం ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తుంది. టీటీడీ భద్రత సిబ్బంది అలసత్వాన్ని వీడి పనిచేయాలని భక్తుల నుండి విజ్ఞప్తి వినిపిస్తుంది. టీటీడీ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులు.