తిరుమలలో కొత్త నిబంధన: అలా చేస్తే.. జరిమానా: నాలుగు లేన్లుగా ఘాట్ రోడ్డు
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ కొత్త నిబంధన అమలులోకి రానుంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తోన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాలని నిర్ణయించారు. జరిమానా ఎంత మొత్తంలో ఉండాలనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. దీనిపై కసరత్తు చేస్తోన్నారు. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకుని రానున్నారు.
భారీ వర్షాలకు
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లు.. కిందటి నెల కురిసిన అతి భారీ వర్షాలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. కొండ చరియలు విరిగిపడి, ఘాట్ రోడ్లు ధ్వంసం అయ్యాయి. సప్తగిరుల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకుని రావడం వల్ల అలిపిరి మెట్ల మార్గం దెబ్బతిన్నది. వాటి మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు టీటీడీ అధికారులు. ఈ పనులు ముగింపుదశకు వచ్చినట్టే. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఘాట్ రోడ్లపై స్పీడ్ గన్స్..
ఘాట్ రోడ్డును పూర్తిస్థాయిలో వాహనదారులకు కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చిన తరువాత.. ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. ఘాట్ రోడ్లపై స్పీడ్ గన్స్ అమర్చనున్నారు. స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. తిరుమలకు రాకపోకలు సాగించే వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మితిమీరిన వేగం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తుండటం, ఘాట్ రోడ్డు దెబ్బతినడాన్ని నివారించడానికి స్పీడ్ గన్స్ అమర్చనున్నారు.
వేగం దాటితే..
ఈ స్పీడ్ గన్స్ ద్వారా వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. పరిమితి దాటిన వేగంతో రాకపోకలు సాగించే వాహనాలపై జరిమానా విధిస్తారు. నిర్ణీత వేగం నిబంధనను ఉల్లంఘించే వాహనాలను స్పీడ్ గన్ల ద్వారా గుర్తించి జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోనున్నారు. స్పీడ్ లిమిట్, జరిమానా మొత్తం ఎంత ఉండాలనే విషయంపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఘాట్ రోడ్లపై జియలాజికల్ సర్వే..
గుర్గావ్కు చెందిన భూమి డెవలపర్స్ సంస్థ ఘాట్ రోడ్లలో డ్రోన్ల ద్వారా జియలాజికల్, టోపోగ్రఫీ సర్వేలను నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదికలను జనవరి 10వ తేదీ నాటికి టీటీడీ అధికారుల చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదికలను అమృత యూనివర్సిటీకి పంపిస్తారు. ఆ యూనివర్శిటీ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. దానికి అనుగుణంగా తదుపరి చర్యలను చేపట్టనున్నారు.
నాలుగు లేన్లుగా ఒకటో ఘాట్ రోడ్డు..
ఒకటో ఘాట్ రోడ్డును నాలుగు లేన్లు విస్తరించాలనే ప్రతిపాదనలు కూడా టీటీడీ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. విస్తరణ పనులకు సంబంధించి ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది. మోకాలిమెట్టు నుంచి జీఎన్సీ టోల్ గేట్ వరకు ఉన్న రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించాల్సి ఉంటుందని నిర్ణయించారు. దీనిపైనా అమృత యూనివర్శిటీ నిపుణుల నుంచి సలహాలను తీసుకుంటారు. జాతీయ స్థాయిలో రోడ్డు నిర్మాణం, విస్తరణలో అనుభవం ఉన్న సంస్థకు ఈ విస్తరణ పనులను అప్పగిస్తారు.