తిరుమలలో వసతి గదుల టికెట్ల విడుదల- ఆన్లైన్లో..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం ఆరంభమైన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. 7 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పడుతోంది.
బుధవారం 71,122 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 29,121 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఈ నెలలో స్వామివారి విశేష ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

ఇప్పటికే తిరుమల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శన టికెట్ల కోటాతో పాటు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల అయ్యాయి. తోమాల, సుప్రభాతం, అష్టదళ పాద పద్మారాధన.. వంటి ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22 న ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి. అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, శ్రీవారి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లను గురువారం నాడే విడుదల చేసింది టీటీడీ.

ఇవ్వాళ తిరుమల, తిరుపతిలో వసతి గదులను బుక్ చేసుకోవడానికి ఉద్దేశించిన ఆన్లైన్ కోటా టికెట్లు విడుదల కానున్నాయి. నవంబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్లు ఇవి. ఈ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో వసతి గదుల టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. భక్తులు http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో మాత్రమే వాటిని బుక్ చేసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications