Tirupati by election: నామినేషన్ వేసిన పనబాక: గురుమూర్తి ఎప్పుడంటే: అభ్యర్థి అన్వేషణలో కమలం
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం.. పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలతో తలమునకలవుతున్నారు. ఇదే ఎన్నికల్లో పోటీలో నిల్చున్న భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గట్లేదు. ఈ రెండు పార్టీల కంటే ముందే వివిధ కులాల ప్రతినిధులతో వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. గడువు సమీపిస్తోన్న కొద్దీ నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. టీడీపీ తరఫున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కొద్దిసేపటి కిందటే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ముగ్గురితో కలిసి మాత్రమే ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట భర్త, పార్టీ సీనియర్ నాయకుడు పనబాక కృష్ణయ్య, జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడొకరు ఉన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్ బాబుకు ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం గూడూరు నియోజకవర్గంలో పార్టీ నేతలతో సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు. రోడ్ షో, ఇంటింటి ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ను ఖరారు చేశారు.
కాగా- ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయనున్న ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి ఈ నెల 29వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తదితరులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్పై చర్చించారు.
నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 30. గడువు సమీపిస్తోన్నప్పటికీ బీజేపీ ఇంకా అభ్యర్థి అన్వేషణలోనే ఉంది. తిరుపత ఉప ఎన్నిక బరిలో ఎవరిని దింపాలనే విషయంపై ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతోంది. ఢిల్లీ పార్టీ పెద్దల నుంచి దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున.. అభ్యర్థి పేరు కోసం ఎదురు చూస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు లేదా కర్ణాటకకు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి.