జగన్పై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు- ఎంతోకాలం ఉండరంటూ..
ఏపీలో తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన మధ్య ముక్కోణపు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్తో పాటు పాటు ఆయన తండ్రి వైఎస్సార్, బీజేపీనీ చింతా వదల్లేదు.
తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా ఉన్న గురుమూర్తి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ కోటి రూపాయలు ఖర్చుపెట్టిందని చింతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడిదని ఆయన వైసీపీని ప్రశ్నించారు. ఒక్క నామిషన్కే కోటి రూపాయలు ఖర్చు చేస్తారా అని చింతామోహన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఎంతోకాలం అధికారంలో ఉండలేరంటూ చింతా జోస్యం చెప్పారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా స్వార్ధ ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కారని చింతా గుర్తుచేశారు.
తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా జనసేన పొత్తుతో పోటీ చేస్తున్న బీజేపీపైనా చింతామోహన్ విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కుపై పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడుతుంటే బీజేపీ మాత్రం కనీస సానుభూతి కూడా చూపడం లేదన్నారు. బీజేపీతో దేశానికీ, దేశ భవిష్యత్తుకూ ప్రమాదముందని చింతా మోహన్ ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మరే పార్టీ కూడా చేయలేదన్నారు. గతంలో తిరుపతి లోక్సభ స్ధానం నుంచి 9 సార్లు పోటీ చేసిన చింతా మోహన్.. ఆరుసార్లు గెలిచి మూడుసార్లు ఓడిపోయారు. గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన చింతా మోహన్ పదోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.