రద్దీ నివారణకు టీటీడీ ప్లాన్.. !!
Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. శనివారం నాడు 79,52 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 40,152 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ అమ్మవారి ఆలయం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మోత్సవ సమయంలో రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
తిరుమలేశుడి దర్శనానంతరం వారికి అందజేసే లడ్డూ తయారీని మరింత ముమ్మరం చేయనున్నారు. ఎంతమంది భక్తులు వచ్చిన వారందరికీ శ్రీవారి ప్రసాదాన్ని ఇఛ్చేలా ఏర్పాట్లు చేస్తోన్నారు. దీనికోసం లడ్డూ కౌంటర్లల్లో అదనపు సిబ్బందిని నియమించే అవకాశాలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో- తిరుమల ఆలయ నాలుగు మాడ వీధులు, లడ్డూ కౌంటర్లను ఆదివారం టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత గల గరుడ సేవ రోజున లక్షలాదిగా విచ్చేసే భక్తుల రాకపోకలు సాగించే మార్గాలను పరిశీలించారు.
లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వాళ్లు ఎక్కువ సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన లడ్డూలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రద్దీని నివారించడంపై దృష్టి సారించాలని సిబ్బందిని కోరారు.












Click it and Unblock the Notifications