శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్- ఎదురు చూపులకు తెర: సీనియర్ సిటీజన్లకూ..!!
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా సాగుతోంది. ఈ నెల 2వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కోట్లాదిమంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉత్తర ద్వారం గుండా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 12వ తేదీ వరకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.
అదే సమయంలో- ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న కోట్లాదిమంది శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ అధికారులు మరో శుభవార్త వినిపించారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన 300 రూపాయల టికెట్లను విడుదల చేయనున్నారు. వాటిని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఈ నెల 9వ తేదీన టీటీడీ అధికారులు ఈ టికెట్లను భక్తుల కోసం విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతున్నందున ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. 12వ తేదీ వరకూ స్పెషల్ దర్శనాలు ఉండవు. ఈ విషయాన్ని ముందే ప్రకటించారు అధికారులు. కాగా- ఈ 10 రోజుల వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం 12వ తేదీన ముగుస్తోన్నందున అదే రోజు నుంచి 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నారు.
దీనికి అవసరమైన టికెట్లను రెండు రోజులు ముందుగా అంటే ఈ నెల 9వ తేదీ నాడే ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు వాటిని విడుదల చేస్తారు. ఈ నెల 31వ తేదీ వరకు కోటా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లను కొని- శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోటా టికెట్లను రేపే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు అవి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.
కాగా- శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు తిరగరాస్తోంది. టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కోట్ల రూపాయల మేర రాబడి వస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఒక్కరోజులోనే టీటీడీకి హుండీ ద్వారా అందిన ఆదాయం 7.68 కోట్ల రూపాయల. ఇంత భారీ ఎత్తున హుండీ ఆదాయం ఇదివరకెప్పుడూ లేదు. గత ఏడాది ఒక్కరోజు హుండీ ఆదాయం అత్యధికంగా 6.31 కోట్ల రూపాయలు. గత ఏడాది ఇది రికార్డయింది.












Click it and Unblock the Notifications