శ్రీవారి భక్తులకు మరో గుడ్న్యూస్: టికెట్ల జారీకి సన్నాహాలు: రెండేళ్ల తరువాత
తిరుపతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు సంవత్సరాల కిందట రద్దు చేసిన మరో సేవను పునఃప్రారంభించనున్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటోన్నారు. టికెట్లను జారీ చేయడానికి సన్నహాలు చేపట్టారు. టీటీడీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అన్ని సేవలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా పరిస్థితి లేదు. కొంతకాలంగా దేశంలో కోవిడ్ కేసులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా రికార్డవుతోన్న కరోనా వైరస్ రోజువారీ కేసుల సంఖ్య రెండువేల కంటే దిగువకు క్షీణించాయి. దీనితో టీటీడీ అధికారులు- ఇదివరకు రద్దు చేసిన సేవలన్నింటినీ ఒక్కటొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తోన్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. సర్వదర్శనం టోకెన్లను సైతం జారీ చేస్తోన్నారు. ఈ క్రమంలోనే ఇక తాజాగా అంగప్రదక్షిణాలకు కూడా టీటీడీ అధికారులు పునరుద్ధరించనున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఖాయం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సేవను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీనికి అవసరమైన టోకెన్లను కూడా అదే రోజు నుంచి జారీ చేయనున్నారు.
దీనితోపాటు- ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానాన్ని కూడా పునరుద్ధరించనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. తిరుమల బాలాజీ కాలనీలోని సీఆర్వోలో ఆర్జిత సేవలు నమోదు చేసుకున్న వారికి లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయించనున్నట్లు వివరించారు. ఇప్పటికే ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్లో ఆర్జిత సేవలను భక్తులకు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్లైన్ను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
కాగా- దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,778 కేసులు నమోదయ్యాయి. 62 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 23,087గా నమోదైంది. రెండు రోజులతో పోల్చుకుని చూస్తే- తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఇప్పటిదాకా 1,81,89,15,234 డోసుల వ్యాక్సిన్ను కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసింది. 12 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు కూడా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అందజేస్తోంది.