TTD: భక్తుల బసకు కొత్త విధానం - అందుబాటులోకి మొబైల్ వసతి సేవలు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తులకు వసతి సమస్య పరిష్కరించేందుకు టీటీడీ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువ అయినప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా టీటీడీ ఛైర్మన్ తిరుమలలో మొబైల్ కంటైనర్లను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కంటెయినర్లలో బస:తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ అయినప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక కంటైనర్ ను జిఎన్సీ వద్దగల టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. మరో కంటైనర్ ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉందని.. నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.

తాత్కాలిక బస కోసం:తిరుమలలో పలుచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని, ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని తెలిపారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో అన్నమయ్య భవనం ఎదురుగా నిర్మించిన కావేరి విశ్రాంతి గృహాన్ని ఛైర్మన్ ప్రారంభించారు.

పుష్కరిణి మూసివేత:తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు.
పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications