తిరుమలలో ఈ తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవ రద్దు
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. ఆదివారం నాడు తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది. 83,825 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,690 మంది తలనీలాలను సమర్పించారు.
ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.57 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ప్రస్తుతం రద్దీ తగ్గింది. కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండనక్కర్లేదు. నేరుగా క్యూలైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ ఉదయం 8:45 నిమిషాల తరువాత సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

ఈ నెల 20వ తేదీన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా ఈ నాలుగు రోజుల పాటు శ్రీమలయప్ప స్వామివారు పుష్కరిణీలో రాత్రి వేళ తెప్పపై విహరిస్తారు. దేవేరులతో కలిసి వేర్వేరు అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
తొలిరోజు శ్రీరామచంద్రమూర్తి, సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా పుష్కరిణిలో మూడు ప్రదక్షిణలు చేస్తారు. రెండోరోజున రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారంలో తెప్పపై ఊరేగుతారు. మూడవ రోజున భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పుష్కరిణిలో తెప్పపై భక్తులను అనుగ్రహిస్తారు.
నాలుగవ రోజు అయిదు ప్రదక్షిణలు, చివరి రోజున ఏడు ప్రదక్షిణలు చేస్తారు. దీనితో తెప్పోత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ నెల 20, 21 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, 22, 23, 24 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవను రద్దు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications