TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త: తెరచుకోనున్న తిరుమలేశుడి ఆలయ ద్వారాలు: అప్పట్లా కాదిక
చిత్తూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీనివాసుడిని దర్శన భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు భక్తులు. స్వామివారికి ఆర్జిత సేవలు, పుజలు, నిత్య కైంకర్యాలు యధాతథంగా కొనసాగుతున్నప్పటికీ.. భక్తుల రాకపై నిషేధం విధించారు. సుమారు 50 రోజులుగా స్వామివారి దివ్య దర్శనం భక్తులకు కరవైంది.
Recommended Video

భక్తుల రాకను పునరుద్ధరించడానికి యాక్షన్ ప్లాన్
నాలుగోదశ లాక్డౌన్ స్వరూపం పూర్తి భిన్నంగా ఉంటుందంటూ ప్రధాని ప్రకటించడంతో ఆలయాల్లో భక్తుల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనికి అనుగుణంగా టీటీడీ ముందస్తు చర్యలను చేపడుతోంది. రోజూ లక్షమంది భక్తులు సందర్శించే తిరుమలలో ప్రాణాంతక కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నివారించడానికి ముందుజాగ్రత్త చర్యగా ఆలయాన్ని మూసివేశారు. భక్తుల రాకను నిషేధించారు. ప్రస్తుతం ఈ నిషేధాజ్ఙలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ తీపి కబురు వినిపించారు.. అదీ అనధికారికంగానే.

28న టీటీడీ పాలక మండలిలో చర్చ..
శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని అంటున్నారు. మరో వారంరోజుల్లో ఈ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రణాళికలకు తుది రూపాన్ని ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించబోయే టీటీడీ పాలక మండలి సభ్యుల సమావేశంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందే అవకాశం ఉందని, ఆ వెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

జూన్ 1 తరువాత..
ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. జూన్ 1వ తేదీ లేదా ఆ తరువాత ఓ శుభ ముహూర్తాన శ్రీవారి ఆలయాన్ని భక్తుల సందర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇదివరకు ఉన్నప్పటి కంటే ఈ సారి ఆంక్షలు పెద్దఎత్తున ఉంటాయని సమాచారం. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించాల్సి ఉన్నందున పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి అనుగుణమైన చర్యలను కూడా ఇదివరకే పూర్తి చేసినట్లు సమాచారం.

కంపార్ట్మెంట్లకు తాళాలే..
ఒక్కో భక్తుడి మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండేలా క్యూలైన్లలో బాక్సులను వేశారని అంటున్నారు. అలాగే- వసతి సముదాయాల గదుల్లోనూ ఇద్దరికి మించి అనుమతి ఇవ్వకపోవచ్చు. అలాగే- స్వామివారి దర్శనానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండే విధానానికి పుల్స్టాప్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఒక్కసారి క్యూలైన్లో అడుగు పెట్టిన భక్తుడు.. ఇక నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

రోజూ ఏడు నుంచి ఎనిమిది వేల మందికే
అప్పట్లా స్వామివారి దర్శనానికి వేలాదిమందిని పంపించినట్లు ఈ సారి కుదరదు. పరిమితంగానే భక్తులను అనుమతిస్తారు. రోజూ ఏడు నుంచి ఎనిమిది వేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పించేలా ఆన్లైన్ ద్వారా స్లాట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో గంటకు గంటకు 500 మంది భక్తులకు ఈ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. దీని ప్రకారం.. రోజూ 14 గంటలు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. మిగిలిన సేవలను యధాతథంగా కొనసాగిస్తారు.

ట్రయల్ రన్లో టీటీడీ సిబ్బందికి.. స్థానికులకు
భక్తుల రాకపోకలను అనుమతించిన తరువాత తొలి మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ సమయంలోనే క్యూ లైన్లలో గానీ, నివాస సముదాయాల్లో గానీ ఏవైనా లోటుపాట్లు తలెత్తితే వెంటనే సరిచేయడానికి మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తారని తెలుస్తోంది. అనంతరం తొలి రెండువారాల పాటు స్థానికులకు అంటే.. తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలకు అనుమతి ఇస్తారు. ఆ తరువాతే మిగిలిన వారికి అవకాశం ఇస్తారు. క్యూలైన్లలో తలెత్తే ఇబ్బందులను పరీక్షించడానికి నిర్వహించే ట్రయల్ రన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications