శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో కొత్తగా మరో అధునాతన వ్యవస్థ అందుబాటులోకి రానుంది. మార్చి 1వ తేదీ నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచిఉంటోన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు 61,374 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 19,691 మంది తలనీలాలను సమర్పించారు. భక్తుల సంఖ్య సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ హుండీ ద్వారా వచ్చిన ఆదాయం భారీగా నమోదైంది. 4.2 కోట్ల రూపాయలుగా నమోదైంది.

పరీక్షల ప్రభావం..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడిన విషయం తెలిసిందే. విద్యార్థులు వాటికి సన్నద్ధమౌతోన్నారు. ఈ షెడ్యూల్స్ అన్నీ ముగిసిన తరువాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కొత్త వ్యవస్థకు శ్రీకారం..
ఈ పరిణామాల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుమలలో కొత్తగా ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దళారుల ప్రమేయం లేకుండా చేయడానికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టారు టీటీడీ అధికారులు.

మార్చి 1 నుంచి..
మార్చి1వ తేదీ నుంచి ఈ ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రస్తుతానికి ప్రయోగాత్మకమే. ఇది విజయవంతమైతే- మరింత విస్తృతం చేస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం విక్రయాల్లో తొలిదశలో దీన్ని అమలు చేయనున్నారు. తమ పేర్లతో మరొకరు గదులను బుక్ చేయడం, ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేయడాన్ని నివారించడానికి ఫేసియల్ రికగ్నిషన్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

పారదర్శకత కోసమే..
గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదాల టికెట్ల విక్రయాలు, భక్తులు ముందస్తుగా చెల్లించే కాషన్ డిపాజిట్ రీఫండ్ చేయడానికి ఉద్దేశించిన కౌంటర్లు వద్ద ఎఫ్ఆర్టీ యంత్రాలను అమర్చుతారు. ఇది దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడతామని, దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అధ్యయనం చేస్తామని అంటున్నారు. భక్తుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని- విస్తృతం చేస్తామని వివరిస్తోన్నారు.












Click it and Unblock the Notifications