మాకు సంబంధం లేదు .. తలనీలాల అక్రమరవాణాపై స్పందించిన టీటీడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా శ్రీవారి తలనీలాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం దుమారం రేపుతున్న క్రమంలో టీటీడీ దీనిపై వివరణ ఇచ్చింది. మిజోరాం సమీపంలో మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ ఓ ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తున్న 120 బ్యాగుల తలనీలాలను పట్టుకున్నారు. వీటి ధర సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తలనీలాల అక్రమ రవాణాపై టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల స్మగ్లింగ్ .. దోపిడీలో జగన్ దారే వేరయా : అయ్యన్న ఫైర్
ఆ తలనీలాలతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు
అస్సాం రైఫిల్స్ పట్టుకున్న సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాల పై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. శ్రీవారికి సమర్పించిన తలనీలాలను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహించే అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని టిటిడి బోర్డు పేర్కొంది. టెండర్లలో ఎక్కువ మొత్తం ఎవరు కోట్ చేస్తే ఆ బిడ్డర్ నుండి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తామని వెల్లడించారు. అయితే జిఎస్టి కట్టిన బిడ్డర్ ఆ తలనీలాలను ఎక్కడికి తీసుకువెళతాడు ఎవరికి విక్రయిస్తారు అనే దానితో టీటీడీకి సంబంధం లేదని పేర్కొన్నారు.
కొనుగోలు చేసిన బిడ్డర్లకు అంతర్జాతీయ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది సంబంధం లేదు
కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ అనుమతులు ఉన్నాయా లేదా అన్నదానితో కూడా తమకు ఎలాంటి సంబంధం ఉండదని టిటిడి స్పష్టం చేసింది. ఈ వేలం ద్వారా తలనీలాలను కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించే టీటీడీకి తలనీలాల అక్రమ రవాణా వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని, తలనీలాలను కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ తీసుకు వెళుతుంది కాబట్టి, ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న సదరు సంస్థలను టీటీడీ దృష్టికి తీసుకు వస్తే వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని పేర్కొంది.
తలనీలాల స్మగ్లింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన టీటీడీ
ఒక్క మాటలో చెప్పాలంటే అక్రమ రవాణా కాంట్రాక్టు పొందిన సంస్థల ద్వారానే జరిగి ఉండొచ్చు అన్న అనుమానం వ్యక్తం చేసింది.
ఇక దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలను విక్రయిస్తుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థ తలనీలాలను ఎక్కడికి తీసుకు వెళుతుంది? ఏ దేశాలలో విక్రయిస్తుంది అన్నది టిటిడికి సంబంధం లేని విషయం. ఇక ఇదే విషయాన్ని తాజా వార్తల నేపథ్యంలో టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారం లో క్లారిటీ ఇచ్చారు.