టీటీడీ లో ప్రత్యేక ఆహ్వానితుల ప్రమాణ స్వీకారాలపై రగడ
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులు కూడా ప్రమాణ స్వీకారం చెయ్యటం రాజకీయ దుమారంగా మారింది.బీజేపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చెయ్యటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు పాలక మండలి తీసుకుంటున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

టీటీడీ పాలక మండలి పై విమర్శలు
ఇటీవల టీటీడీ పాలక మండలి జంబో జాబితాను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ,కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు ల నుంచి పలువురు ప్రముఖులకు టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం అవకాశం కలిపించింది. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారికి, గతంలో సీఎం జగన్ మరియు వైసీపీ నేతలు విమర్శలు గుర్ప్పించిన వారికి సైతం స్థానం కల్పించింది.

ప్రత్యేక ఆహ్వానితుల ప్రమాణ స్వీకారంపై మండిపడుతున్న బీజేపీ నేత
ఇక వైసీపీ పాలక మండలి సభ్యుల ఎంపిక నే వివాదం కాగా , ప్రత్యేక ఆహ్వానితులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించటం కూడా ఒక దుమారంగా మారింది . ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణ స్వీకారం చేయించటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు బీజేపీ నేత భానూప్రకాష్ రెడ్డి . పాలకమండలి ఇష్టానుసారం ప్రవర్తిస్తుందని ఆయన మండిపడుతున్నారు. ఏకపక్షంగా వ్యవహారిస్తూ వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంటోందన్నారు. పాలకమండలిలోని ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదని చట్టాలు చెబుతున్నాయన్న ఆయన గత ప్రభుత్వాల హయాంలో టీటీడీ పాలక మండలి సభ్యులు కాక ప్రత్యేక ఆహ్వానితులు ఎవరూ ప్రమాణ స్వీకారాలు చెయ్యలేదని ఆయన పేర్కొన్నారు.

శ్రీవారి నిధుల వినియోగంపై టీటీడీ నిర్ణయాలు వివాదాస్పదం అన్న భాను ప్రకాష్ రెడ్డి
ఇక పాలక మండలి ఎవరి ఆదేశాలతో ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణ స్వీకారాలు చేయించారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనికి భక్తులకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక టీటీడీ శ్రీవారి నిధుల విషయంలో కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ఆరోపించారు. శ్రీవారి నిధులను కేవలం ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని కానీ నిధులను ఇష్టానుసారం దారి మళ్ళిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

జగన్ సర్కార్ సమాధానం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేస్తామన్న బీజేపీ నేత
యాక్ట్ 30 ఆఫ్ 1987 శ్రీవారి నిధులను దేనికి వాడాలో స్పష్టంగా చెప్తున్నా టీటీడీ బోర్డు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అవిలాల చెరువు, గరుడ వారధి పనులకు ఈ నిధులను వినియోగించటానికి వీలు లేదన్న బీజేపీ నేత భాను ప్రకాష్ ఈ నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ నిధులతో ఈ పనులు చెయ్యాలని చెప్పారు . ఇక టీటీడీ లో జరుగుతున్న అవకతవకలకు సమాధానం ఇవ్వకపోతే న్యాయపోరాటానికి అయినా వెనుకాడమని ఆయన తేల్చి చెప్పారు. దీంతో టీటీడీ పాలకమండలిలో వరుస తప్పిదాలు వివాదంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications