శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : దర్శన టికెట్లు - సేవలు మీ చేతిలోనే..!!
Tirumala: తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనంతో పాటుగా స్వామి వారికి అందించే సేవల టికెట్లను నేరుగా భక్తుల వద్దకే అందుబాటులో తెచ్చే విధంగా కొత్త ఆలోచన కు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఆన్ లైన్ - ఆఫ్ లైన్ సేవల ద్వారా భక్తులకు టికెట్లు జారీ చేస్తున్నారు. ఇక వసతి గదుల మొదలు శ్రీవారి సేవల వరకు అన్నింటకీ ఒకే చోట అందుబాటులో ఉంచేలా టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది.

టికెట్లు..సేవలు ఒకే చోట అందుబాటులో..
తిరుమలకు వచ్చే భక్తులకు కావాల్సిన పూర్తి సమాచారం ఒకే చోట లభించేలా టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమల కొండకు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా ఒక యాప్ సిద్దం చేస్తున్నారు. టీటీడీ ఐటీ విభాగం దీనిని సిద్దం చేస్తోంది. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఇందులో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు..సేవలు..వసతి గదులు బుక్ చేయటం తో పాటుగా ఏ సమయంలో ఏ మేర అందుబాటులో ఉన్నాయనే సమాచారం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించి టీటీడీలో పని చేసే ఐటీ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ యాప్ రూపకల్పన దాదాపు పూర్తయినట్లు సమాచారం.

టికెట్లతో పాటుగా అప్ డేటెడ్ సమాచారంతో
నిత్యం తిరుమలకు వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల భక్తులు...విదేశాల నుంచి వచ్చే వారు ఉన్నారు. వీరికి ప్రస్తుతం టీటీడీ ఆన్ లైన్ బుకింగ్ అవకాశం మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి వారికి నిర్దేశించిన సమయం ప్రకారం కొండ పైన వసతి గదులు.. శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే, సేవలకు సంబంధించి టికెట్లు మినహా ఇతరత్రా అవకాశాలు లేవు. కానీ, ఇప్పుడు యాప్ ద్వారా మరింత ఆధునీకరణతో శ్రీవారి సేవలను వినేందుకు వీలుగా రూపకల్పన చేస్తున్నారు. కొంత కాలం క్రితం టీటీడీ అధికారులు గోవింద యాప్ ను తీసుకొచ్చారు. కానీ, దాని వలన భక్తులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో, ఇప్పుడు నిత్యం భక్తులకు కావాల్సిన సమాచారం తో కొత్త యాప్ సిద్దం అవుతోంది.

నేరుగా శ్రీవారి సేవలు వినేందుకు వీలుగా
కొత్తగా తీసుకొస్తున్న యాప్ ద్వారా భక్తులకు మరో అరుదైన అవకాశం దక్కనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీటీడీ వెబ్ సైట్ ద్వారా దర్శనం..వసతి తో పాటుగా అందుబాటులో ఉన్న తేదీల్లో శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కానీ, కొత్తగా అందుబాటులోకి వస్తున్న యాప్ ద్వారా భక్తులు సులభంగా గదులు..శ్రీవారి దర్శన టికెట్లు పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పాటుగా ఈ యాప్ ద్వారా శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భక్తులకు లభించే అరుదైన అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ముక్కోటికి వచ్చే భక్తులకు ఏర్పాట్లలో నిమగ్నమైన టీటీడీ..త్వరలోనే ఈ యాప్ ను అధికారికంగా అందుబాటులోకి తీసుకు రానుంది.












Click it and Unblock the Notifications