మే నెలలో శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్లను విడుదల చేసే తేదీలు ఇవే..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. గురువారం నాడు 57,357 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 18,924 మంది తలనీలాలను సమర్పించారు.
హుండీ ద్వారా 3.52 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. 22 కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ వారాంతంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

కాగా- ఈ ఏడాది మే నెలకు సంబంధించిన అన్ని రకాల టికెట్లు/టోకెన్లను విడుదల చేసే తేదీలను టీటీడీ అధికారులు వెల్లడించారు. మే నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా ఈ నెల 24వ తేదీన విడుదల అవుతుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో వాటిని అందుబాటులో ఉంచుతారు.
మే నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18వ తేదీన ఓపెన్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధాన సేవల లక్కీడిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
లక్కీ డిప్ ఫలితాలు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. డిప్లో ఎంపిక అయిన వాళ్లు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించి తమ పేరును ఖరారు చేయించుకోవాల్సి ఉంటుంది.
22వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్లు 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయి. సీనియర్ సిటిజన్లు/దివ్యాంగుల కోటా బుకింగ్ అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శనం, వసతి గదుల కోటా 23వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో వస్తాయి.












Click it and Unblock the Notifications