తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పేలిన రెండు నాటు బాంబులు .. తనిఖీలలో బయటపడిన విషయం ఇదే !!
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో నాటు బాంబుల కలకలం రేగింది. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈరోజు ఉదయం రెండు నాటు బాంబులు పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాటు బాంబులు పేలిన ఘటనలో అక్కడే ఉన్న ఓ కుక్క, ఓ పంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన యూనివర్సిటీ కి చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
ఒకపక్క తిరుపతిలో పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల హడావుడి కొనసాగుతూ ఉంటే, నాటు బాంబులు పేలడం అందరినీ ఒక్క సారిగా భయాందోళనకు గురి చేసింది. బాంబు స్క్వాడ్ సిబ్బంది అక్కడ తనిఖీలు చేశారు. పెరుమాళ్ళ పల్లెకు చెందిన ఇద్దరు అనుమానితులను యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు నాటు బాంబులు అడవి పందులు పట్టుకోవడం కోసం వేటగాళ్ళు పెట్టిన బాంబులు గా గుర్తించారు .
జంతువులను వేటాడటం కోసం అక్కడ పెట్టిన ఇద్దరు వేటగాళ్లు ను అరెస్ట్ చేసిన పోలీసులు ,వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు గా తెలుస్తోంది. ఇక యూనివర్సిటీలో ఈ తరహా బాంబు బ్లాస్ట్ ఘటనలు విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, నాటు బాంబు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.