తిరుమలలో కొత్త భవనం.. భూమిపూజ: బుల్లెట్ ప్రూఫ్: ప్రాంగణం నుంచి వెలుపలికి: ఇక నేరుగా చూడొచ్చు
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో కొత్త భవనం నిర్మితం కానుంది. ఈ భవనం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో.. తూర్పు మాడా వీధిలో ఈ కాంప్లెక్స్ రూపుదిద్దుకోబోతోంది. ఈ భవన సముదాయం నిర్మాణ వ్యయం 8 కోట్ల 90 లక్షల రూపాయలు. మురళీకృష్ణ అనే శ్రీవారి భక్తుడు నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ముందుకొచ్చారు. ఈ మొత్తాన్ని తిరుమలకు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు.
వైఎస్ జగన్ ముందు రమణ దీక్షితులు కొత్త ప్రతిపాదన: టీటీడీపై విమర్శలు: వారిని ఆదుకోవాలంటూ
భక్తులకు నివాస వసతిని కల్పించడానికో లేదా ప్రసాదాల విక్రయాలకో దీన్ని నిర్మిస్తున్నారనుకుంటే పొరపాటే. పరకామణి కోసం దీన్ని నిర్మిస్తున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న సందర్భంగా భక్తులు హుండీ ద్వారా సమర్పించుకునే కానుకలను లెక్కించడానికి ప్రత్యేకంగా ఈ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పరకామణి.. శ్రీవారి ఆలయప్రాకారం లోపల కొనసాగుతోంది. దీన్ని వెలుపలికి తరలించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఇరుకు గదుల్లో హుండీ కానుకల లెక్కింపును నిర్వహిస్తున్నారు టీటీడీ ఉద్యోగులు.
భక్తుల సంఖ్య పెరుగుతుండటం వల్ల పరకామణిని ఆలయ ప్రాంగణం లోపల కొనసాగించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అభిప్రాయాలు చాలాకాలం నుంచి టీటీడీలో వ్యక్తమౌతున్నాయి. సువిశాల భవనంలో దీన్ని నిర్మించాలని టీటీడీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. సుమారు 15 వేల చదరపు అడుగుల్లో అత్యాధునికంగా ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు. సీసీటీవీ, బయోమెట్రిక్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
Recommended Video
పరకామణి కోసం కొత్త భవనాన్ని నిర్మించడానికి ఇదివరకు నిర్వహించిన పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. నిర్మాణ వ్యయం అంచనాను ప్రాథమికంగా నిర్ధారించారు. 8 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలను రూపొందించారు. బెంగళూరుకు చెందిన మురళీధర్ అనే భక్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అందిస్తానని టీటీడీకి వెల్లడించారు. ఆయన ఇచ్చే విరాళం మొత్తంతో దీన్ని నిర్మిస్తున్నారు. కానుకల లెక్కింపు ప్రక్రియను భక్తులు నేరుగా వీక్షించేలా భవన సముదాయాన్ని నిర్మిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చుతారని తెలుస్తోంది.