అందుకే జగన్తో స్నేహం: మంచి చేస్తానో లేదో తెలియదు కానీ..: పోసాని
ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ నటుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పోసాని కృష్ణ మురళి బాధ్యతలను స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
విజయవాడ: ప్రముఖ నటుడు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఇవ్వాళ ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్రెడ్డి, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్రెడ్డి హాజరయ్యారు.
ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ఇదివరకే నామినేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పోసాని మాట్లాడారు. కులాలు, మతాలు, డబ్బుల్లో నుంచి నాయకులు పుడుతుంటారని, వారికి భిన్నంగా వైఎస్ జగన్ జనం నుంచి పుట్టిన నాయకుడని అభివర్ణించారు. ఆయన వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే జగన్ తో తాను స్నేహం చేశానని చెప్పారు.
మడమ తిప్పని నాయకుడిగా జనం మదిలో జగన్ చెరగని ముద్ర వేసుకున్నారని, ప్రజల నుంచి ఆయనను ఎవరూ వేరు చేయలేరని పోసాని వ్యాఖ్యానించారు. స్వీటెస్ట్, హాటెస్ట్, హానెస్ట్, గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్.. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఇవ్వడం వల్లే తాను ఈ పదవిని స్వీకరిస్తున్నానని చెప్పారు.
తనకు అన్నం పెట్టి, జీవితాన్ని ఇచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి తాను ఎంత మంచి చేస్తానో చెప్పలేను కానీ, చెడు మాత్రం చేయనని అన్నారు. ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ గా ఎలాంటి మోసాలకు పాల్పడబోనని, అబద్ధాలు చెప్పనని అన్నారు. చిత్ర పరిశ్రమకు సేవ చేస్తానని, వైఎస్ జగన్ కు చెడ్డపేరు తీసుకుని రానివ్వకుండా బాధ్యతలు నిర్వహిస్తానని పోసాని పేర్కొన్నారు. తాను చనిపోయేంత వరకు జగన్, వైసీపీతోనే ఉంటానని, పార్టీ జెండా తప్ప తన మరో అజెండా లేదని స్పష్టం చేశారు.