హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ స్పందన- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు- త్వరలో కీలక భేటీ
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం స్వాగతించింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూడా హైకోర్టు తీర్పుపై విడిగా స్పందించారు.
Recommended Video
ఏపీలో హైకోర్టు తీర్పు ప్రకారం గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని, తేదీల మార్పు కోరబోమని హైకోర్టుకు హామీ ఇచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఎన్నికలను నాలుగు విడతల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొంది. హైకోర్టు తీర్పుతో పాటే గ్రామాల్లో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని, ప్రజాప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎలాంటి పనులు చేయొద్దంటూ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారని ఎన్నికల సంఘం గుర్తు చేసింది.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సాధ్యమైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సిబ్బందితో పాటు ఓటర్ల భద్రతకు కరోనా వల్ల ముప్పు వాటిల్లకుండా తగిన ప్రోటోకాల్ను గతంలోనే ప్రకటించామని, దాన్ని క్షేత్రస్ధాయిలో ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. గతానుభవాల దృష్ట్యా శాంతిభద్రతలపై తాము నిశితంగా దృష్టిపెడతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ద్వారకాతిరుమల పర్యటనలో ఉన్న నిమ్మగడ్డ కూడా ఇవే అంశాలను మీడియాకు వెల్లడించారు.












Click it and Unblock the Notifications