సీఐడీ రాడార్లో టీడీపీ మాజీమంత్రి: నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంతో దాడులు..తనిఖీలు
అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పొంగూరు నారాయణ చిక్కుల్లో చిక్కుకున్నారు. సీఐడీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీలను నిర్వహిస్తున్నారు. విజయవాడ, నెల్లూరుతో పాటు హైదరాబాద్లోని నివాసాల్లో ఒకేసారి ఈ తనిఖీలు ఆరంభమయ్యాయి. నారాయణకు సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు.
మొత్తం 10 చోట్ల సిఐడి అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. అమరావతిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యవహారంలో పీ నారాయణ ప్రమేయం ఉన్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన చంద్రబాబుతో పాటు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నారాయణకు కూడా నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల మేర భూముల సమీకరణ, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) ఏర్పాటు వంటి అంశాలన్నింటినీ స్వయంగా పర్యవేక్షించినది నారాయణే.
అప్పటి ప్రభుత్వంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఒకట్రెండు కమిటీలు కూడా ఆయన సారథ్యాన్ని వహించారు. భూ సమీకరణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ నారాయణ ప్రమేయం ఉందని భావించిన సీఐడీ అధికారులకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు పిలిపించారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్లల్లో తనిఖీల సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నారాయణ ఇంట్లో లేరని సమాచారం.
సీఐడీ నోటీసుల్లో తన పేరు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఙాతంలోకి వెళ్లారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన భార్యకు నోటీసులు అందజేశారని సమాచారం. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ.. ఈ నెల 23వ తేదీన విజయవాడ సత్యనారాయణ పురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. నోటీసులు జారీ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా భావిస్తోంది.