చంద్రబాబు ఏం చేయబోతున్నారు? న్యాయ నిపుణులతో మంతనాలు: మరో స్టే కోసమేనా?
అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తదుపరి ఏం చేయబోతోన్నారు? విచారణకు హాజరవుతారా? లేదా? విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది? మరో స్టే కోసమే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారా?- ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమౌతోన్న ప్రశ్నలివి. నోటీసులను అందుకున్న చంద్రబాబు మున్ముందు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఉత్కంఠతను రేపుతోంది.
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐతో విచారణకు జగన్ సర్కార్ సై: ఏప్రిల్ 7న సుప్రీంలో
అమరావతి భూ కుంభకోణంలో ఏపీ సీఐడీ అధికారుల నుంచి నోటీసులను అందుకున్న ఆయన.. ప్రస్తుతం న్యాయ నిపుణులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందనే సలహాలను తీసుకుంటున్నారు. దీనికోసం పలువురు న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వొకేట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఈ కేసు విషయంలో ఆయన దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబుకు పలు చట్టాల కింద ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను అందజేసిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు అయ్యాయి. 120 బీ, 166, 167, 217, 34, 35, 36, 37 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆయా సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు.. అమరావతి భూ కుంభకోణం ఆరోపణలకు వర్తిస్తాయా? లేదా? అనే విషయంపై చంద్రబాబు వారిని అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. సంబంధం లేని కేసులను నమోదు చేశారనే కారణంతో స్టే తీసుకోవడానికి అవకాశం ఉందా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.