ఏపి ప్రభుత్వ కీలక నిర్ణయం: ఫోన్ ట్యాపింగ్ కు అధికారం పొడిగింపు..!!
ఏపి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ..ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు రాజకీ యంగా పలు అనుమానాలు సృష్టిస్తున్నాయి. కావాల్సిన వారి మొబైల్..టెలిఫోన్లు..ఇంటర్నెట్ సర్వీసు లపై నిఘా పెట్టేందుకు వీలుగా ఇంటలిజెన్స్ అధికారులకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ..ఈ ఉత్తర్వుల ద్వారా రాజకీయ నేతల ఫోన్ల పైనా నిఘా పెడతారా అనే అనుమానం మొదలైంది. అయితే, ప్రభుత్వం మాత్రం తన ఉత్త ర్వుల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని మరో ఏడాది పొడిస్తున్నట్లు పేర్కొంది. భద్రతా కోణంలోనే ఈ నిర్ణయం అని ప్రభుత్వం చెబుతున్నా.. రాజకీయ నాయకుల ఫోన్ల పైనా నిఘా పెట్టేందుకే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపిలోని సిబిఐ ఎంట్రీ కి ఎర్ర జెండా ఊపుతూ నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటలి జెన్స్ విభాగం రాష్ట్రంలోని టెలిఫోన్లు..మొబైల్స్..ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల ను ట్యాపింగ్ చేసే హక్కును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది 2019 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు ఫోన్ ట్యాపింగ్ చేయటానికి గడువు పొడిగిస్తూ నిర్ణయించింది. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 2007 ప్రకారం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనుమానితుల ఫోన్లు..ఇంటర్నెట్ పై నిఘా పెట్టవచ్చు. నిఘా విభాగానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు ట్యాపింగ్ చేయవచ్చని ఉత్వర్వుల్లో పేర్కొంది. అయితే, ఎన్నికల సమయంలో ఏకంగా ఏడాది కాలం పాటు ట్యాపింగ్ అధికారాన్ని పొడిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.
ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రజల భద్రత పేరుతో తీసుకున్నప్పటికీ...రాజకీయంగానూ దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే అనుమానాలు విపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపిలో నిఘా వ్యవస్థ పూర్తిగా రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారనే విమర్శ ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా జారీ చేసిన జీవో ద్వారా నిఘా అధికారులకు మరింత వెసులుబాటు కలుగుతుందనే ఆందోళన వారితో కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని సాధారణ ప్రక్రియ లో భాగంగానే..అధికారం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.