విజయసాయి రెడ్డి అధికారాలకు కత్తెర?: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రిటైర్డ్ ఐఎఎస్?
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా గుర్తింపు పొందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అధికారాలకు కత్తెర పడబోతోందా? ఆయన ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారా? ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కొన్ని అధికారాలను తొలగించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆయనకు ఉన్న కేబినెట్ మంత్రి హోదాను కుదించవచ్చని చెబుతున్నారు.

వైసీపీలో నంబర్ టూగా..
వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి నంబర్ టుగా గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ తరువాత ఆ స్థాయిలో ఆయనకు ప్రాధాన్యత లభిస్తోంది వైసీపీలో. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ అధినేతగా, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయా పదవులను నిర్వహించడానికి అర్హత ఉన్న నేతగా ఆయన పార్టీలో గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నారు. వ్యూహాలను రూపొందిస్తున్నారు.

అధికారాల్లో కోత
అత్యంత కీలకమైన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానాన్ని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంకు అప్పగించవచ్చని అంటున్నారు. దీనిపై వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అజేయ కల్లంను ఏపీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించవచ్చని చెబుతున్నారు. ఆర్థిక అంశాలపై అజేయ కల్లంకు ఉన్న పట్టు వల్లే ఆయనకు ఈ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. కేబినెట్ ర్యాంకు హోదాలో కొనసాగిస్తారని సమాచారం.

బుగ్గన వెంట ఢిల్లీలో..
కొద్దిరోజుల కిందటే ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దేశ రాజధానిలో పర్యటించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా కొందరు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి నిర్మలా సీతారామన్ వద్ద ప్రస్తావించారు. సంక్షేమ పథకాలను కొనసాగించడానికి, అభివృద్ధి పనులను చేపట్టడానికి తీసుకోదలచిన రుణాలు, ఇతరత్రా నిధుల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ష్యూరిటీగా ఉండాలనీ అభ్యర్థించారు.

బుగ్గన సిఫారసుల మేరకే..
ఈ పర్యటన సందర్భంగా బుగ్గన వెంట అజేయ కల్లం ఉన్నారు. ప్రత్యేక సలహదారు హోదాలో అజేయ కల్లం కేంద్రమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు ఉన్న పట్టును గుర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అజేయ కల్లం సేవలను విస్తరించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు భావించారు. ఢిల్లలో ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా అజేయ కల్లంను నియమిస్తే బాగుంటుందంటూ వైఎస్ జగన్కు సూచించినట్లు చెబుతున్నారు. దీనితో వైఎస్ జగన్ ఈ దిశగా నిర్ణయాన్ని తీసుకోవచ్చనే ప్రచారం.. వైసీపీ వర్గాల్లో ఊపందుకుంటోంది.

సాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించినట్టుగా..
విజయసాయి రెడ్డి స్థానంలో అజేయ కల్లంను నియమించడమంటూ జరిగితే.. అది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కావడం ఖాయమే. తెలుగుదేశం పార్టీ నేతలు.. సాయిరెడ్డిని టార్గెట్గా చేసుకుని విమర్శలను గుప్పించే ప్రయత్నం చేయవచ్చు. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపైనా వైసీపీ నేతలు ఫుల్ క్లారిటీతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. సాయిరెడ్డి బాధ్యతలను తగ్గించే ప్రయత్నంగా చూడలేమని అంటున్నారు. అజేయ కల్లం సేవలను విస్తరించుకునే కోణంలో మాత్రమే ఈ అంశాన్ని చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

సాయిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించినట్టుగా..
సాయిరెడ్డి ఇప్పటికే తీరిక లేకుండా గడుపుతున్నందున.. అధికార ప్రతినిధి బాధ్యతలను అజేయ కల్లంకు అప్పగించడం వల్ల ప్రయోజనం ఉంటుందే తప్ప నష్టం జరగదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదివరకు ఆర్థికశాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారిగా ఆ శాఖపై అజేయ కల్లంకు మంచి పట్టు ఉందనడంలో సందేహాలు అక్కర్లేదని, దాన్నే తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకునేలా నిర్ణయాలను తీసుకోవడం తప్పేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications