బార్ కు వెళ్తే..మత్తు దిగాల్సిందే : ఏపీలో మద్యం ధరలు భారీగా పెంపు: నేటి నుండే అమలు ..!
ఏపీలో దశల వారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. బార్ల సమయాలను కుదించింది. ఇదే సమయంలో బార్ల ద్వారా జరిగే మద్యం విక్రయాల ధరలను భారీగా పెంచుతూ కేటగిరీల వారీగా ఎంత మొత్తంలో పెంచాలో నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త బార్ల విధానం మేరకు లాటరీ ద్వారానే కొత్త వారిని ఎంపిక చేస్తారు. ఇక, దరఖాస్తు ఫీజును రూ 10 లక్షలుగా ఖరారు చేసారు. బార్లలో మద్యం అమ్మకం సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పరిమితం చేసారు.
నేటి నుండే తెలంగాణలో నూతన మద్యం విధానం: తెరుచుకున్న కొత్త మద్యం షాపులు
కొత్త మద్యం పాలసీ..
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఖరారు చేసింది. దీని మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
లాటరీ విధానంలో కొత్త బార్లు..
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు తాజాగా కొత్త మద్య విధానం ఖరారు చేసారు. మద్యం ముట్టుకుంటే భారీ షాక్ కొట్టేలా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద ధరలను పెంచారు. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుంది. జనవరి 1 నుంచి ఏర్పాటయ్యే బార్లను లాటరీ విధానంలో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. బార్ల లైసెన్సుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.10 లక్షల చలానా, బార్ ఏర్పాటు చేసే ప్రదేశానికి చెందిన ప్లాన్, అద్దెకు తీసుకుంటే యజమాని నుంచి కన్సెంట్ లెటర్ను సమర్పించాలి. ఈ బార్ల వ్యాపారంలో ఇప్పటి వరకు టీడీపీ వారే ఎక్కువగా ఉన్నారనే రద్దు చేస్తున్నారనే ప్రచారానికి ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు ఎవరైనా చేసుకోవచ్చని సూచించింది.
బార్ల సమయం కుదింపు..
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు..వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్,ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేస్తారు.
భారీగా ధరలు..తక్షణం అమలు
ఇదే సమయంలో బార్ల ద్వారా జరిగే మద్యం అమ్మకాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ధర పైన 60 ఎం ఎల్ కు రూ 30 పెంచగా.. ఫారిన్ లిక్కర్ కు రూ 30 పెరిగింది. అదే విధంగా బీర్ల ధరలను రూ 30 నుండి పరిమాణంకు అనుగుణంగా పెంచుతూ నిర్ణయించారు. ఇదే క్రమంలో పరిమాణానికి అనుగుణంగా ధరలు పెంచుతూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసారు. ఐఎంఎల్ 2000 ఎం ఎల్ కు రూ. 750 వరకు పెంచగా.. విదేశీ మద్యం 1500 ఎం.ఎల్ కు రూ.750 పెరిగింది. రెడీ టూ డ్రింక్ 250 ఎం ఎల్ రూ.60 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపు తక్షణం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.