పరిషత్ తీర్పులో నీలం సాహ్నీపై హైకోర్టు ఫైర్- ఎస్ఈసీగా అర్హతపై అనుమానాలు ?
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నీలం సాహ్నీకి కూడా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఇవాళ ఇచ్చిన సంచలన తీర్పులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఎదురుదెబ్బగా మారాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తమకు అనుగుణంగా అన్వయించుకోవడం పట్ల ఎస్ఈసీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని చదవడం, అవగాహన చేసుకోవడంలోనూ ఎస్ఈసీ వైఫల్యాన్ని తప్పుబట్టింది.
ఎస్ఈసీకి శరాఘాతంగా హైకోర్టు తీర్పు
ఏపీలో పరిషత్ పోరుపై హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నీలం సాహ్నీకి శరాఘాతంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ విషయంలో పాటించాల్సిన కనీస మార్గదర్శకాలు పాటించలేదంటూ ఎన్నికలనే రద్దు చేసిన అరుదైన తీర్పు కావడంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్ధానిక ఎన్నికల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తమకు అనుకూలంగా అన్వయించుకోవడంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
నీలం సాహ్నీకి హైకోర్టు అక్షింతలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటఫికేషన్ను రద్దు చేస్తూ ఇవాళ ఇచ్చిన తీర్పులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ గురించి హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఎస్ఈసీ నీలం సాహ్నీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఎన్నికల కమిషన్ తనకు అనుకూలంగా అన్వయించుకోవడంపై తీవ్రంగా ఆక్షేపించింది. సుప్రీం కోర్టు తీర్పును ఇలా అన్వయించుకోవడం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పులో నోటిఫికేషన్ తర్వాత పోలింగ్కు నాలుగు వారాల సమయం కచ్చితంగా ఇవ్వాలని ఉందని పేర్కొంది.
నీలం తీరుపై హైకోర్టు ఆశ్చర్యం
సుప్రీంకోర్టు గతంలోఇచ్చిన మార్గదర్శకాలను చదవడం, అర్ధం చేసుకోవడంలో ఎస్ఈసీ నీలం సాహ్నీ వైఫల్యం చెందారని హైకోర్టు ఆక్షేపించింది. చదవడం, రాయడం,ఇంగ్లీష్ భాషపై అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీంకోర్టు తీర్పు అర్ధమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారని, ఆమె సుప్రీంకోర్టు తీర్పును సరైన దృక్పథంలో అర్ధం చేసుకోకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఎస్ఈసీగా నీలం అర్హతపై ఆలోచించాల్సిందే
గతంలో ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో పనిచేసిన నీలం సాహ్నీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని పట్టించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల కమిషనర్గా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. పదవీ బాధ్యతలుస్వీకరించగానే ఆమె నోటిఫికేషన్ ఇచ్చారని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని ఏపీ హైకోర్టు పేర్కొంది.