ఏపీలో మేయర్, ఛైర్మన్ల ఎన్నికలు-తాడిపత్రిలో టెన్షన్-విజయవాడలో అసమ్మతి
ఏపీలో 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తాడిపత్రి మినహా మిగతా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లు చేజిక్కించుకున్న వైసీపీ తమ మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్ధుల జాబితాను ఆయా చోట్లకు పంపింది. వీటి ఆధారంగానే ఎన్నికల్లో వారిని సభ్యులు ఎన్నుకుంటారు.
రాష్ట్రంలో మిగతా చోట్ల ఎలాంటి ఇబ్బందీ లేకున్నా.. తాడిపత్రి మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠంపై మాత్రం తీవ్ర ఉత్కంఠ సాగుతోంది. ఇప్పటికే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 16, వైసీపీ 16 సీట్లు సాధించడం, వైసీపీకి అదనంగా రెండు ఎక్స్ ఆఫీషియో ఓట్లున్న నేపథ్యంలో ఇరు పార్టీల బలాబలాలు సమానం అయ్యాయి. సీపీఐ, ఓ ఇండిపెండెంట్ అభ్యర్ధులు టీడీపీకి మద్దతిస్తుండటంతో ప్రలోభాలకు లోనుకాకుండా వీరు ఓటేస్తే టీడీపీ ఇక్కడ ఛైర్మన్ పీఠం అందుకుంది. లేకపోతే వైసీపీకి పీఠం దక్కుతుంది. దీంతో ఇక్కడ దాదాపు 600 పోలీసులను నియమించి మరీ ఉద్రిక్తతలు జరగకుండా ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది.
అటు విజయవాడ మేయర్ పీఠం ఆశించిన సీనియర్ కార్పోరేటర్, గతంలో వైసీపీ తరఫున స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేసిన బండి పుణ్యశీల నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కార్పోరేషన్ మేయర్ అభ్యర్దిగా భాగ్యలక్ష్మి పేరును ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటన తర్వాత ఆమె అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మేయర్ పీఠంపై పుణ్యశీల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే స్ధానిక సమీకరణాలతో భాగ్యలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. అయితే కనీసం డిప్యూటీ మేయర్గా కూడా పుణ్యశీలను ఎంపిక చేయకుండా ఇతరుల పేర్లు తెరపైకి రావడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్పోరేటర్గా ప్రమాణస్వీకారానికి పుణ్యశీల రాకపైనా సందిగ్ధం నెలకొంది.