చంద్రబాబు రైతులను వంచించాడు.. తొలి సంతకం చేసిన రుణమాఫీనే మరిచాడు...
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. ఐదేళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని ఆయన ప్రజలను వంచించారని విమర్శించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం వెళ్లదీశారని దుయ్యబట్టారు. రూ.85 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా.. రూ.15 వేల కోట్లు అందజేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
రైతులంటే గిట్టదా ?
రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అన్నదాత కోసం జగన్ ఆరాటపడుతుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. తమ 100 రోజుల పాలనలో రైతుల కోసం ఏం చేశామో జనానికే తెలుసన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పాడుపడుతున్నామని పేర్కొన్నారు. రైతు పెట్టుబడి సాయం రూ.12 వేల 500 ఇస్తామని చెప్పి అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే వడ్డీ లేని రుణం ఇస్తున్నామని గుర్తుచేశారు ఇందుకోసం 3200 కోట్లు కేటాయించామని తెలిపారు.
100 రోజుల్లో చేసిందిదీ..
వైఎస్ఆర్ ఉచిత భీమా కోసం 2200 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆయిల్ ఫాం రైతులకు తెలంగాణతో సమానంగా ధరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 80 కోట్లు మంజూరు చేశామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఏ మార్కెట్లో రైతు నష్టపోకూడదని జగన్ ఆశయమన్నారు. పంట నష్టపోయిన శాతాన్ని కూడా 15 శాతం పెంచామని తెలిపారు. కౌలురైతుల కోసం కౌలు కార్డు ఇవ్వడానికి చట్టం తీసుకొచ్చామని తెలిపారు.
విమర్శలు సరికాదు
100 రోజుల్లో ఇన్నాళ్లు చేస్తుంటే.. టీడీపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసి అమలుచేయని సీఎంగా చరిత్రలో చంద్రబాబు నిలిచిపోయారన్నారు. కానీ తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ఎక్కడ ప్రజలు నిలదీస్తారనే భయంతో ఇంటర్నెట్లో కూడా మేనిఫెస్టో లేకుండా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.
అప్పలను కూడా మళ్లించారు
రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి రూ.2 వేల కోట్లు అప్పు తీసుకొచ్చామని చెప్పి.. రైతు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. అప్పటికే ఉన్న పథకాలకు నిధులు మళ్లించారని పేర్కొన్నారు. చంద్రబాబు రుణమాఫీలో రాజకీయం తప్ప.. రైతుల సంక్షేమం కోసం పాటుపడలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై చంద్రబాబు మాట తప్పారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. కేవలం 2 నెలలు భృతి ఇచ్చి.. తమ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు. తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేయించడం మంచి పద్ధతి కాదన్నారు.