అమరావతికి మరో ఝలక్- అసెంబ్లీ కూడా వద్దంటున్న కొడాలి- చర్చిద్దామన్న జగన్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై న్యాయ స్ధానాల్లో కేసుల విచారణ సాగుతుండగానే ప్రభుత్వం అమరావతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోందా అంటే అవుననే అంటున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. ముఖ్యంగా అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం, రాజధానిలో జరిగిన అక్రమాలు, వాటి వెనుక ఉన్న టీడీపీ పెద్దలు ఇలా అన్ని వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుంటే అమరావతిలో శాసన రాజధాని కొనసాగించడం కూడా అనవసరమనే భావన ఈ ప్రాంతానికి చెందిన మంత్రుల్లోనే వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇదే విషయాన్ని వారు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

అమరావతిలో అసెంబ్లీకీ నో..
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రకారం అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలిపోతే ఇక అక్కడ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది. కేవలం అసెంబ్లీని మాత్రమే ఉంచడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, రాజధాని అభివృద్ధి చెందదని ఇక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయంపై హైకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ రాజధానిలో పేదలకు స్ధానం లేకుండా టీడీపీ నేతలు, వారి సన్నిహితులు ఆక్రమించారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడంపైనా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించి ప్రభుత్వాన్ని అడ్డుకుంది. దీంతో అసలు పేదలకు కూడా ఇళ్ల స్ధలాలు ఇవ్వనివ్వకుండా టీడీపీ చేస్తున్న కుట్రలతో ఇక్కడ శాసన రాజధాని ఉండి కూడా ఉపయోగం లేదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. దీన్ని కూడా తరలిస్తేనే మంచిదని ఆయన భావిస్తున్నారు.

జగన్కు కొడాలి సలహా..
ఏపీ శాసన రాజధానిలో పేదలకు ఉండేందుకు కూడా అవకాశం లేదని, తాజాగా పేదల ఇళ్ల స్ధలాలు కేటాయించినా టీడీపీ దాన్ని అడ్డుకుందని, పేదలకు అవకాశం లేని రాజధాని ఉండీ ఉపయోగం లేదని సీఎం జగన్కు కొడాలి నాని తాజాగా తెలిపారు. దీనిపై అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని జగన్ నానికి హామీ ఇచ్చారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో రాజధాని కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వంలో అంతర్గతంగా తీవ్రంగానే మథనం సాగుతున్నట్లు తెలుస్తోంది. పేదలకు అవకాశం లేకుండా టీడీపీ నేతలు ఆక్రమించారని చెబుతున్న రాజధానిని తాము తరలించబోతున్నామనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపేందుకే వైసీపీ దీనిపై చర్చ మొదలుపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యకమవుతోంది.
Recommended Video

వైసీపీ ఆలోచన వెనుక ?
వైసీపీ సర్కారు రాజధాని అమరావతి ప్రాంతంలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్ధలాలు కేటాయించింది. రాజధాని కట్టేందుకు తమ భూములు తీసుకుని ఇప్పుడు పేదలకు ఎలా ఇస్తారంటూ టీడీపీ నేతలు, స్ధానిక రైతులు హైకోర్టుకు వెళ్లి దీన్ని అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉంది. కనీసం పేదల ఇళ్ల స్ధలాలకు కూడా అవకాశం లేనంతగా రాజధాని భూములను టీడీపీ ఆక్రమించిందని, అలాంటి రాజధాని కొనసాగింపు అవసరమా అన్న చర్చను వైసీపీ తెరపైకి తెస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ పేదలకు అవకాశం లేకుండా రాజధానిలో భూదందా సాగిందనే ఆరోపణను మంత్రులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మాత్రమే కొడాలినాని సూచన చేశారన్న అభిప్రాయం వైసీపీలోనూ వ్యక్తమవుతోంది. కానీ ఇప్పటికే రాజధానుల తరలింపు పేరుతో సచివాలయం, హైకోర్టు తరలింపుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీని కూడా తరలించాలన్న నిర్ణయం తీసుకుంటే దీనిపై మరింత రచ్చ ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications