ఏపీలో భారీగా మున్సిపల్ పోలింగ్-11 గంటలకు 32 శాతం-ఓటేసిన గవర్నర్, మంత్రులు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. పట్టణాలు, నగరాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం సాధారణ ఎన్నికల తరహాలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ భారీగా పోలింగ్ శాతాలు నమోదవుతున్నాయి. ఎన్నికల సంఘం కూడా పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పొలింగ్.. ఆరంభంలో కాస్త మందకొడిగా కనిపించినా 10 గంటల తర్వాత వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉదయం మందకొడిగా కనిపించిన పోలింగ్ ఆ తర్వాత జోరందుకుంది. కోస్తా జిల్లాల్లోనూ భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో ఇక్కడ భారీ ఎత్తున పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి పలు జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 36.31 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత స్ధానాల్లో ప్రకాశం 36.12, పశ్చిమగోదావరి 34.14, కర్నూలు 34.12, గుంటూరు 33.62, కడప 32.82, నెల్లూరు 32.67, కృష్ణా 32.64, విజయనగరం 31.97, అనంతపురం 31.36, చిత్తూరు 30.12, విశాఖ 28.5 శాతం పోలింగ్ నమోదయ్యాయి. రాష్ట్ర సగటు చూసుకుంటే 32.23 శాతంగా ఉంది.

విజయవాడలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మచిలీపట్నంలో మంత్రి పేర్నినాని కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు వేశారు. విజయవాడలో టీడీపీ మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత, వంగవీటి రాధా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులతో పాటు పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్ హరిచందన్ సూచించారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు వినియోగం తప్పనిసరి అన్నారు. రాష్ట్ర ప్రధమ పౌరుడిగా బాధ్యతతో తన ఓటు హక్కు వినియోగించుకున్నానని హరిచందన్ తెలిపారు.
ఏపీలో భారీగా మున్సిపల్ పోలింగ్-11 గంటలకు 32 శాతం-ఓటేసిన గవర్నర్, మంత్రులు#AndhraPradesh #APMunicipalElections2021 #APMuncipalElections pic.twitter.com/Yk5JalXSCK
— oneindiatelugu (@oneindiatelugu) March 10, 2021












Click it and Unblock the Notifications