ఏపీ రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ - ఈసారి రంగంలోకి ఉద్యోగులు -తప్పుడు సమాచారంపై ఫైర్..
ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకూ రాజధాని తరలింపుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో రైతులు పోరాటం చేస్తుండగా.. తాజాగా ఈ పోరాటం ఉద్యోగులు వర్సెస్ రైతులుగా మారింది. రాజధాని తరలింపు విషయంలో హైకోర్టులో రైతులు చేస్తున్న పోరాటంలోకి తమను లాగడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఈ కేసులో తమ అభిప్రాయం చెప్పుకునేందుకు వీలుగా సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్..
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే రైతులు దాఖలు చేసిన పిటిషన్లలో రాజధాని తరలింపు కోసం ఉద్యోగులను ఒప్పించేందుకు ఉద్యోగ సంఘాలు పలు తాయిలాలు ఆశ చూపుతున్నారని ఆరోపించారు. అలాగే ఉద్యోగ సంఘాలు తమ సమావేశంలో చర్చించని అంశాలను పిటిషనర్లు తమ పిటిషన్లలో ప్రస్తావించారని సచివాలయ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. తద్వారా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఉద్యోగ సంఘ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్
ఈ ఏడాది మార్చి 18న సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘ సమావేశంలో రాజదాని తరలింపుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తాము కోరినట్లు, ప్రభుత్వం తరఫున తాయిలాలు ఆశ చూపినట్లు రైతులు తమ పిటిషన్లలో పేర్కొనడంపై సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాము చర్చించని విషయాన్ని చర్చించినట్లు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై న్యాయపోరాటం కోసం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖు చేసింది. ఈ కేసులో తమ అభిప్రాయాలు కూడా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఉద్యోగ సంఘ నేతలు కోరారు.
భారీ జరిమానాకు డిమాండ్...
అమరావతి పరిరక్షణ సమితి గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగితే ఏనాడూ స్పందించలేదని, అలాంటిది ఈసారి పేదలకు ఇళ్లస్ధలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతోందని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నిస్తోంది. అమరావతి రాజధాని పనులు 70 శాతం పూర్తయ్యాయన్న వాదన పూర్తిగా అవాస్తవమని చెబుతోంది. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాజకీయ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడటం కోసమే పిటిషన్లు వేశారని ఉద్యోగులు ఆరోపించారు. రాజధాని తరలింపుకు రూ.70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, దీన్ని ఏ ఉద్యోగ సంఘం కూడా వ్యతిరేకించడం లేదని వారు తెలిపారు. రాజధాని తరలింపు కోసం ఉద్యోగులకు ఇంటి లోన్, మెడికల్ సబ్సిడీ వంటి తాయిలాలు ఆఫర్ చేసినట్లు పిటిషనర్లు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారని, కాబట్టి ఈ పిటిషన్ కొట్టేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి నిరాధార పిటిషన్లు వేయకుండా భారీ జరిమానా విధించాలని కోర్టును కోరినట్లు ఉద్యోగులు వెల్లడించారు.