క్యాపిటల్ వార్ .. నారా లోకేష్ అరెస్ట్ .. రాజధానిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
Recommended Video
ఏపీ రాజధాని అమరావతి మార్చవద్దు అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది అమరావతి పరిరక్షణా సమితి. ఈ నేపధ్యంలో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. రాజధాని ఆందోళనల నేపధ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునివ్వటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు . టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు.

జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని భగ్నం చేస్తున్న పోలీసులు .. అరెస్ట్ లు
దీంతో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్భంధం చేస్తున్నారు. గుంటూరులో పొలిటికల్ జేఏసీ నేతలను ముందుగానే అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఇక టీడీపీ కీలక నేతలను సైతం తెల్లవారుజామునుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మరోవైపు టిడిపి నాయకులు, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులందరినీ అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో మెజారిటీ నాయకులు గృహ నిర్బంధంలో ఉన్నారు.
నారా లోకేష్ ను బెంజ్ సర్కిల్ వద్ద అరెస్ట్ .. ఉద్రిక్తతల నడుమ పీఎస్ కు తరలింపు
ఇక జాతీయ రహదారుల దిగ్బంధనానికి బయలుదేరిన నారా లోకేష్ ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . లోకేష్ అరెస్ట్ ను టీడీపీ నేతలు అడ్డుకోవటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జాతీయ రహదారి దిగ్భందానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో నారా లోకేష్ చినకాకానికి బయలుదేరారు . ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే లోకేష్ని అరెస్ట్ చేశారు. బెంజ్ సర్కిల్ సమీపంలో ఆయన్ని అరెస్ట్ చేసి యనమల కుదురు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

గద్దె రామ్మోహన్ దీక్షకు సంఘీభావం ప్రకటించి వస్తున్న క్రమంలో అరెస్ట్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలికి ఆయనకు సంఘీభావంగా నారా లోకేష్ వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి వెళ్ళకుండా అరెస్ట్ చేశారు. అయితే లోకేష్ పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేష్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ .. యనమల కుదురు పీఎస్ కు తరలింపు
ఆయనతో పాటు టీడీపీ నేతలు రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లోకేష్ అరెస్ట్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక నేడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి ప్రయత్నం చేస్తున్న రైతుల ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు . అయినప్పటికీ రాజధాని రైతులతో పాటుగా పలు పార్టీల నేతలు రోడ్లపై ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications