Vijayawada Cell Tower : విజయవాడలో భానుడి భగభగలు-కాలిపోయిన సెల్ టవర్ ...
ఏపీలో భానుడి ప్రతాపం అంతకంతకూ పెరుగుతోంది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులతో వడగాల్పుల ప్రభావం తీవ్రమవుతోంది. దీంతో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీని ప్రభావం విజయవాడపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవిలో విజయవాడలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతుంటాయి. ఈసారి ఈ తీవ్రత మరింత పెరిగింది. దీంతో నగరంలోని ఓ సెల్ ఫోన్ టవర్ కాలిపోయింది.
విజయవాడ నగరంలోని గీతా నగర్ ఐడీఎఫ్ సీ బ్యాంకు భవనంపై ఉన్న సెల్ ఫోన్ టవర్ ఇవాళ ఉన్నట్లుండి కాలిపోయింది. దీంతో స్దానికంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బ్యాంకు సిబ్బందితో పాటు స్ధానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్ కు కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిస్ధితి అదుపులోకి తెచ్చారు. విజయవాడలో పెరిగిన వడగాల్పుల తీవ్రత కారణంగా పెరిగిన వేడికి సెల్ ఫోన్ టవర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దట్టమైన పొగ అలుముకుంది.

విజయవాడలో గత కొన్ని రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులతో పిల్లలు,వృద్ధులు అల్లాడుతున్నారు. ఇప్పటికే వాతావరణ విభాగం చేస్తున్న హెచ్చరికలతో జనం అప్రమత్తమయ్యారు. అవసరం లేకపోతే పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయినా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో జనంలో ఆందోళన పెరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు తప్పవని ఇప్పటికే వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాబోయే మూడు రోజుల్లోనూ ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications