మీ కోసం 'మీరు' సరే.. మామాటేమిటి: కాంగ్రెస్తో దోస్తీపై చంద్రబాబు లాజిక్, నలుగురికీ సమాధానం
అమరావతి: కాంగ్రెస్ పార్టీతో జత కట్టడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న కారణం ధీటుగానే ఉందా? అంటే అవుననే అంటున్నారు. అలాగే, ఎన్టీఆర్ పదవీచ్యుతిడిని చేసిన వైస్రాయ్ ఘటన విషయంలోను తెలంగాణ సీఎం కేసీఆర్కు గట్టిగానే సమాధానం ఇచ్చారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జతకట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీని, నరేంద్ర మోడీని కాంగ్రెస్, చంద్రబాబులు టార్గెట్ చేశారు. టార్గెట్ ఒక్కటయినప్పటికీ వీరిద్దరు కలవడం తెలుగు రాష్ట్రాల ప్రజలను నోరు వెళ్లబెట్టేలా చేసింది. కాంగ్రెస్తో పొత్తుపై ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలా ఎందరో ప్రశ్నించారు. వారందరికీ టీడీపీ సమాధానం చెబుతోంది.
టీడీపీ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది
మోడీని, బీజేపీని ఎదుర్కొనేందుకు ఇటీవలి కాలంలో దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న పార్టీను చూస్తూనే ఉన్నాం. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, బీహార్లో కొంతకాలం జేడీయూ, ఆర్జేడీయూలు కలిసి ఉన్నాయి. ఆ పార్టీలను పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్లు కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై టీడీపీ స్థాపించబడింది.
ఆళ్లగడ్డలో కీలక నేత షాక్ ఎఫెక్ట్: మీలో ఎవ్వర్నీ వదలను, ఏం చేస్తానంటే: వైసీపీకి అఖిలప్రియ హెచ్చరిక
ఆ ఒక్కటే కారణం.. అయినా విమర్శలు
అయితే, దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవడంపై ఆ పార్టీ నేతలు, చంద్రబాబు ఒకటే కారణం చెబుతున్నారు. అదే ప్రత్యేక హోదా. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా ఇస్తారనే బీజేపీతో 2014లో కలిశామని, ఇప్పుడు ఆ హామీ నెరవేరనందున, అవే హామీలు నెరవేరుస్తామని చెబుతున్న కాంగ్రెస్తో జతకడుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. అయినప్పటికీ విమర్శలు వస్తున్నాయి.
మీరు కలిశారుగా..
దీనిపై టీడీపీ నేతలు లాజిక్ లాగుతున్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఎవరితోనైనా కలుస్తానని చెప్పారని, అందులో భాగంగానే ఓసారి కాంగ్రెస్తో, మరోసారి తమ పార్టీతో (టీడీపీ), ఉద్యమంలో బీజేపీ, లెఫ్ట్ తదితర పార్టీలతో జతకట్టారని గుర్తు చేస్తున్నారు. ఉద్యమంలో లెఫ్ట్, బీజేపీలు ఏకం కావడాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీతో కలిస్తే తప్పేమిటి?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సిద్ధాంతపరంగా విభేదాలు కలిసిన పార్టీలు ఏకమైనప్పుడు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీతో కలిస్తే తప్పేమిటని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ కోసం తెరాస ఎలా కలిసిందో, హోదా-విభజన హామీల కోసం తాము అలా కలుస్తున్నామని చెబుతున్నారు. దీంతో మోడీ, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్లకు నలుగురికీ... చంద్రబాబు ఒకే దెబ్బకు సమాధానం చెబుతున్నారు. అదే సమయంలో, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మధ్యలో యూటర్న్ తీసుకోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉండే హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని, మోడీని ఆకాశానికి ఎత్తి, ఇప్పుడు హఠాత్తుగా హోదానే మంచిదని చెప్పడం ఏమిటని, ఈ హఠాత్తు యూటర్న్ దానికి తోడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడాన్ని ప్రశ్నిస్తున్నామని విపక్షాలు అంటున్నాయి. అంటే రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారనేది వారి వాదన.
ఎన్టీఆర్ ఇష్యూపై కేసీఆర్ కార్నర్
ఇక, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు చంద్రబాబును టార్గెట్ చేసుకునేటప్పడు 1995 నాటి వైస్రాయ్ హోటల్ ఇష్యూను పలు సందర్భాలలో లాగారు. ఇటీవల కేసీఆర్ కూడా అదే విషయం మాట్లాడటం గమనార్హం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని వైసీపీ, బీజేపీలు మండిపడుతుంటాయి. కేసీఆర్ అదే విధంగా మాట్లాడారు. దీనికి చంద్రబాబు అంతే ధీటుగా సమాధానం చెప్పడం గమనార్హం. ఎన్టీఆర్ను పదవీచ్యుతిడిని చేశానని కేసీఆర్ చెబుతున్నారని, ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని, అతను నా పక్కనే ఉన్నారని, సిద్ధాంతకర్తే అయన అని దిమ్మతిరిగే షాకిచ్చారు. ఎన్టీఆర్ విషయంలో కేసీఆర్ను చంద్రబాబు కార్నర్ చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ కోసం మీరంతా కలిసినప్పుడు హోదా కోసం మేం కలువొద్దా అంటూ విపక్షాలను కూడా కార్నర్ చేశారని అంటున్నారు.