రాజధానిలో చంద్రబాబు పర్యటన నేడే .. రాజకీయవర్గాల్లో ఆసక్తి
రాజధాని అమరావతిలో నేడు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు అమరావతి పర్యటన చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు అమరావతి పర్యటనపై వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో నేడు జరగనున్న ఆయన పర్యటన పై ఆసక్తి నెలకొంది.

చంద్రబాబు రాజధాని పర్యటన .. రాజధానిలో ఏం జరుగుతుందో చెప్పే యత్నం
ప్రస్తుత ప్రభుత్వం అమరావతి పనులను నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేయడం కోసం అమరావతి పర్యటన చేపట్టారు. టిడిపి హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఉపాధి లేక కూలీలు జీవనోపాధి కోల్పోయారని రాజధాని ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఫైరవుతోంది. రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఇలా
ఇక టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన వెంకటాయపాలెం మీదుగా సాగుతుంది. వెంకటాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు గ్రామాల మీదుగా టీడీపీ అధినేత చంద్రబాబు బృందం పర్యటిస్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన నిర్మాణాలు, రోడ్ ప్రాజెక్టులను మాజీ సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. మొదట సీడ్ యాక్సిస్ రోడ్ ద్వారా వెంకటాయపాలెం మీదుగా ఉద్దండరాయునిపాలెం చేరుకుని పేదల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలిస్తారు.

రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న చంద్రబాబు ... వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం
ఆ తర్వాత ఎన్జీవోలు, ఉద్యోగుల క్వార్టర్స్ను పరిశీలిస్తారు. అలాగే ఎమ్మెల్యేల గృహ నిర్మాణాలు, జడ్జిల బంగ్లాలను సందర్శించి అక్కడి పరిస్థితులు పర్యవేక్షిస్తారు చంద్రబాబు. అమరావతిలో ఏం జరుగుతోందో చెప్పేందుకే రాజధాని పర్యటనకు వెళ్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని మీద ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు మాట్లాడుతూ వైసీపీ నేతలు, మంత్రులు ఏపీ బ్రాండ్ ఇమేజ్ చెడగొడుతున్నారని బాబు మండిపడ్డారు.

రాజధానిని స్మశానంతో పోల్చటంపై చంద్రబాబు మండిపాటు
మంత్రులు రాజధానిని స్మశానంతో పోలుస్తూ భ్రష్టుపట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాజధానిపై వైసిపి వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని చంద్రబాబు అభివర్ణించారు. ఏపీలో పెట్టుబడులు రాకుండా చేసి, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

టీడీపీ అధినేత బాబు పర్యటనపై విరుచుకుపడుతున్న వైసీపీ మంత్రులు
మరోవైపు చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. రాజధానిలో పర్యటించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని మంత్రులు విరుచుకుపడుతున్నారు. రాజధానిలో పందులు, కుక్కలు, దున్నపోతులు తిరుగుతున్నాయని ఇక వాటితో పాటు చంద్రబాబు తిరుగుతాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు రాజధానికి సరైన రోడ్లు వేయని ఆయన ఇప్పుడెందుకు అమరావతిలో పర్యటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నేడు కొనసాగిన చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వర్గాలలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో నెలకొంది.












Click it and Unblock the Notifications