సాగునీటి ప్రాజెక్ట్ లపై సీఎం జగన్ దృష్టి .. విమర్శలపై చంద్రబాబు దృష్టి : స్పీకర్ తమ్మినేని
ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ఆర్ధికంగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం సీఎం వైయస్ జగన్ అన్ని సమస్యలను అధిగమించి ముందుకు సాగుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం జగన్ సాగు నీటి ప్రాజెక్ట్ ల విషయంలో అనుమతులు, నిధులు ఇవ్వడం అభినందించాల్సిన విషయం అని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఇక ఇలాంటి సమయంలో కూడా సీఎం జగన్ పరిపాలన సమర్ధవంతంగా చేస్తుంటే చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చెయ్యటం తగదని హితవు పలికారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త జల జగడం ... తగ్గేదెవరో... నెగ్గేదెవరో !!
పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
ప్రస్తుతం రాష్ట్రంలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్ధ్యం పెంచాలని సీఎం జగన్ శ్రీశైలం నుండి నీటిని ఎత్తిపోయాలని, సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఆపాలని నిర్ణయం తీసుకోవటంతో సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో దుమారం లేచింది. ఇక ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు వైసీపీ నాయకులు . ఇక పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం .
రూ.22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నాము
ఆమదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తయిందని, ఇక మదనాపురం, తాళపత్రి, అన్నంపేట, వెన్నెలవలస, నందివాడలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అనుమతులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు . రూ.22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నామని చెప్పిన స్పీకర్ దీంతో 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు .
గతంలో చంద్రబాబు అవినీతి తప్ప చేసిందేమీ లేదు
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిందేమీ లేదని , చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని స్పీకర్ పేర్కొన్నారు . గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్ట్ లు, ఎత్తిపోతల పథకాలు అన్నిట్లో అక్రమాలే కొనసాగాయని పేర్కొన్నారు . అక్రమాల వల్ల ఎత్తిపోతల పథకాలు డిజైన్లు మార్చడం, నష్టపరిహారం చెల్లించటం వంటివి వివాదాస్పదం అయ్యాయని విమర్శించారు . ఇక రాష్ట్రంలో ఒక పక్క కరోనా , మరో పక్క ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటె చంద్రబాబు హైదరాబాద్ కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్న స్పీకర్ ఇప్పటికైనా చంద్రబాబు మారాలని విజ్ఞప్తి చేశారు .
చంద్రబాబు రియలైజ్ అయితే మంచిదని స్పీకర్ హితవు
గ్యాస్ లీకేజీ బాధితులకు అత్యంత ఉన్నతమైన వైద్యం అందించామని పేర్కొన్న ఆయన కరోనా కష్టకాలంలో ప్రజలను టీడీపీ పట్టించుకోక పోగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తుందని పేర్కొన్నారు . చంద్రబాబు ఇప్పటికైనా రియలైజ్ కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రమాదాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చిందో గుర్తు చేసుకుని ఇప్పటి ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుందో తెలుసుకొని అభినందించాలి అని తమ్మినేని పేర్కొన్నారు. అలా కాకుండా ఇలా ప్రతి దానికి విమర్శలు చెయ్యటం మంచిది కాదన్నారు .