అందరి చూపూ జగన్ వైపు- జగన్ చూపు ఆ మంత్రి వైపే...శ్రమతో పరిశ్రమను గెల్చిన ఘనుడు..
సాధారణంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అయినా, విజయాలు, వైఫల్యాలు అయినా అభిమానులతో పాటు ప్రత్యర్ధుల దృష్టిని సైతం తనవైపుకు తిప్పుకునే వైసీపీ అధినేత, సీఎం జగన్ సాధారణంగా ఎవరినీ పొగిడినట్లు కనిపించరు. ఆయన మెప్పు కోసం క్యాంపు ఆఫీసు చుట్టూ తిరిగే నేతలే కానీ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్ ను మెప్పించిన నేతలు కూడా అరుదుగానే ఉంటారు. అలాంటిది తన కేబినెట్ లోని ఓ మంత్రి మాత్రం అధికారం చేపట్టిన నాటి నుంచీ పలు సందర్భాల్లో తన పనితీరుతో జగన్ ను మెప్పిస్తూనే ఉన్నారు.

జగన్ మనసు గెల్చిన మంత్రి....
సహజంగానే జగన్ ను పొగిడే పార్టీ నేతలే కానీ ఆయన ఎవరినీ పొగిడినట్లు కనిపించదు. జగన్ ను మెప్పించడం అఁత సులభం కాదని తెలిసినా పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే కేవలం తన పనితీరుతో జగన్ ప్రశంసలు దక్కించుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించారు ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఊపిరి పోసే బాధ్యతను గౌతం రెడ్డి ఎంతో నిబద్దతతో నెరవేరుస్తున్నారు. క్లిష్ట సమయంలో పరిశ్రమల మంత్రిగా ఆయన చేస్తున్న కృషితో తాజాగా కియా మోటార్స్ కరోనా సమయంలోనూ 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో మరోసారి గౌతం రెడ్డిపై జగన్ ప్రశంసల జల్లు కురిపించారు.

ఎంటర్ ప్రైజింగ్ ఎంట్రప్రిన్యూర్ అంటూ..
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని.. ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలతో ముంచెత్తారు. సీఎం క్యాంపు కార్యాలయంలో 'మన పాలన - మీ సూచన' సదస్సులో పారిశ్రామిక, పెట్టుబడులు, నైపుణ్య రంగాలపై ఏడాది పాలనపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులు తీసుకురావడంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృషిని మెచ్చుకున్నారు. పారిశ్రామిక నేపథ్యం ఉన్నవాడు కాబట్టి వాటి అవసరాలకు అనుగుణంగా స్పందిస్తారని.. "మంచి స్పందించే హృదయం ఉన్నోడని" పొగడ్తలతో ముంచెత్తారు. "మన గౌతమ్ వెరీ ఎంటర్ ప్రైజింగ్ మినిస్టరే అనే దానికన్నా.. మంచి ఎంటర్ ప్రైజింగ్ ఎంట్రప్రిన్యూర్.. ఇండస్ట్రియల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల ఇండస్ట్రీస్ అవసరాలకు బాగా సానుకూలంగా స్పందించే హృదయం ఉన్నోడు.. యంగ్ స్టర్, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు.. అన్ని రకాలుగా ప్రో యాక్టివ్ గా ఉంటాడు.. ఆల్ ది బెస్ట్ గౌతమ్" అంటూ సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

రాజకీయ వారసత్వం- అరుదైన పనితనం..
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సుపరిచితుడైన మాజీ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడైన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డిది విలక్షణ శైలి. పారిశ్రామికవేత్తగా అనుభవం ఉన్న గౌతం రెడ్డిని తొలిసారి మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్న సీఎం జగన్ ను మెప్పించేందుకు ఆయనకు ఎంతోకాలం పట్టలేదు. పరిశ్రమల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు గౌతమ్ తీవ్రంగా కృషి చేశారు. గౌతం కృషి వల్లే రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయనుకున్న కియా మోటార్స్, రిలయన్స్, అదానీ పరిశ్రమలు ఇక్కడే ఉండేందుకు అంగీకరించాయి. తాజాగా కియా మోటార్స్ వెళ్లిపోతోదంటూ విపక్షాలు ఎంతగా ప్రచారం చేసినా కియా మాత్రం అదనపు పెట్టుబడులకు సిద్ధం కావడం కేవలం గౌతం ఘనతే అనేది సీఎం మాటల్లో కనిపించింది.

కరోనా సంక్షోభంలో అంతా తానై....
కేవలం రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి గౌతం రెడ్డిపై ఎవరికీ అంతగా అంచనాలు లేవు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయలేదు. కేవలం పనితీరునే నమ్ముకున్న గౌతంరెడ్డికి ప్రభుత్వంతో పాటు కేబినెట్ సహచరుల్లోనూ మంచి పేరుంది. అయితే పరిశ్రమల శాఖ కార్యకలాపాలు, లేదంటే నియోజకవర్గం అభివృద్ధి, వారాంతాల్లో హైదరాబాద్ లో కుటుంబంతో కాసేపు సేదతీరడం.. గౌతంరెడ్డి అజెండాలో కనిపించేది ఈ మూడు అంశాలే. తాజాగా కరోనా సమయంలో విపక్షాలతో పాటు జాతీయ మీడియాలోనూ అక్కడక్కడా విమర్శలు వినిపించినా ప్రభుత్వం తరఫున గట్టిగా సమాధానం ఇచ్చారు గౌతం రెడ్డి. ఆరోగ్య మంత్రి ఆళ్లనాని తరఫున అంతా తానే కరోనా టెస్టులపై దేశవిదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి మేలు జరిగిలే చేశారు. ఇవాళ ఏపీలో బారీగా కరోనా టెస్టులు జరుగుతున్నాయంటే దానికి కారణం గౌతం రెడ్డే అనేది సీఎం జగన్ కు కూడా తెలియనిది కాదు. అందుకే మరోసారి గౌతం రెడ్డిపై, ఆయన పనితీరుపై తాను పెట్టుకున్న నమ్మకం ఒమ్ముకాలేదని జగన్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications