ఐటీ రైడ్స్ పై అవినాష్ రియాక్షన్ ఇదీ..! 24 గంటల తనిఖీల తర్వాత తేల్చింది ఇదే..
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరులో భాగంగా వరుసగా జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్ధల దాడులు ఏపీకి కూడా పాకాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న జరిగిన ఐటీ తనిఖీల్లో భాగంగా విజయవాడలోనూ ఆ సంస్ధతో లావాదేవీలు నడిపిన వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. అవినాష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ వివరాల్ని ఆయనే ఇవాళ స్వయంగా వెల్లడించారు.
వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్గ్ గా ఉన్న దేవినేని అవినాష్ ఇంట్లో నిన్న ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఐటీ తనిఖీలు ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో ముగిశాయి. హైదరాబాద్ లోని వంశీ రామ్ బిల్డర్స్ తో అవినాష్ కుదుర్చుకున్న ల్యాండ్ డెవలప్ మెంట్ ఒప్పందంపై అవినాష్ ని ఐటీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇవాళ ఉదయం ఐటీ అధికారులు తనిఖీలు పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత వీటిపై వివరాల్ని అవినాష్ మీడియాకు వెల్లడించారు.
ఐటీ శాఖ అధికారులకు పూర్తిగా సహకరించానని దేవినేని అవినాష్ వెల్లడించారు. ఐటీ శాఖ అధికారులు వారి వద్ద ఉన్న అఫిడవిట్ సమాచారం మేరకు తనిఖీలు చేశారని అవినాష్ పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగిన తనిఖిలు మాత్రమేనన్నారు. తమ జీవితం తెరిచిన తెల్ల పుస్తకం లాంటిదని, ప్రజలే తమ ఆస్తులని ఆయన తెలిపారు. తమకు ఎటువంటి వ్యాపారాలు లేవన్నారు. దేవినేని కుటుంబ చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. ఐటి సోదాల్లో ఎటువంటి అక్రమాలు బయటపడలేదన్నారు. మాకు నిత్యం ప్రజల్లో ఉండడం, రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని దేవినేని అవినాష్ తెలిపారు.