ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు -ముఖ్యమైన తేదీలు- రోజువారీ విశేషాలివే
ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది ఉత్సవాలకు తీవ్ర ఆటంకం కలగడంతో ఈసారి దాన్ని మరిపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా వ్యాప్తి భయాలతో భక్తుల రాకపై కొన్ని ఆంక్షలు విధిస్తున్నా స్ధూలంగా చూస్తే శరన్నవరాత్రులను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా రోజుకు పదివేల మంది భక్తులకు ఆన్ లైన్ స్లాట్ ద్వారా మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. నాలుగు వేల మందికి ఉచిత దర్శనం, మూడు వేల మందికి 300 రూపాయల టిక్కెట్ దర్శనం, మరో 300 మందికి 100 రూపాయల దర్శనం కేటాయించినట్లు దేవస్ధానం ఆలయ బోర్డు ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. మూలా నక్షత్రం రోజున పది వేల మంది భక్తులను పెంచే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. 11 వ తేదీన రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. ఉదయం అన్నపూర్ణాదేవి అలంకారంలో, మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అక్టోబర్ 12 మూలానక్షత్రం రోజున దుర్గమ్మకు సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దసరాలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దుర్గమ్మ దర్శనం ఉంటుంది. మూలానక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుర్గమ్మ దర్శనం కల్పిస్తారు.
7 వ తేదీన తొలిరోజు దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి గా భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. అలాగే వీఐపీలు ఖచ్చితంగా స్లాట్ లేదా కరెంటు బుకింగ్ ద్వారా టిక్కెట్ తీసుకోవాల్సిందేనని ఈసారి ఆంక్షలు విధించారు. ఈ ఏడాది కోటి రూపాయలుతో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ బోర్డు చెబుతోంది.