ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు - భక్తులకు కీలక సూచనలు..!!
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాత్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్లుండి నుంచి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ చేసారు. పది రోజులపాటు ప్రత్యేక అలంకారాలు చేయనున్నారు. ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు. మూలా నక్షత్రం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఇదే సమయంలో భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేసారు.
దసరా ఉత్సవాలు
కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రోజుకో దివ్య అలంకారంతో జగన్మాత భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆలయాన్ని మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ చేశారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలను సైతం రూపొందించారు.

అలంకారాలివే
కనదుర్గమ్మ ఉత్సవాల్లో రోజుకో అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల3న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 4న శ్రీ గాయత్రీదేవిగా, 5న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 6న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 7న శ్రీ మహాచండీ దేవిగా, 8న శ్రీ మహాలక్ష్మీదేవిగా, 9న అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజు శ్రీ సరస్వతి దేవిగా, 10న దుర్గాష్టమి పర్వదినాన శ్రీ దుర్గాదేవిగా, 11న మహార్నవమి రోజు శ్రీ మహిషాసుర మర్దనీ దేవిగా, 12న విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అనుగ్రహించనున్నారు.
దర్శనాలు రద్దు
ఉత్సవాల్లో సమయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాలను రద్దు చేసింది. భక్తులంతా బంగారువాకిలి నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత దర్శనం, టికెట్ల దర్శనాల కోసం ఐదు మార్గాలను ఏర్పాటు చేసింది. వీఐపీల రద్దీని నియంత్రించేందుకు వారికి ప్రత్యేక సమయాలను కేటాయించింది. పది రోజుల పాటు అమ్మ సన్నిధిలో భక్తులు కుంకుమ పూజలు చేసేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిత్యం రెండు బ్యాచులుగా పూజల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు కూడా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వీటితో పాటు శ్రీ చక్రనవావరణార్చన, ప్రత్యేక చండీ హోమాలను ఉత్సవాల సమయంలో విశేషంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications