చంద్రబాబుకు ఎన్నికల సంఘం మరో షాక్: ఏపీ కేబినెట్ లేనట్లేనా: సమీక్షతోనే సరి..!
ఏపీ కేబినెట్ లేనట్టేనా. పరిణామాలు అదే విషయం స్పష్టం చేస్తన్నాయి. కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన ఏపీ కేబినెట్ 14న కూడా జరిగే పరిస్థితి కనిపించటం లేదు. ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించటం ప్రతిష్ఠాత్మకంగా భావించిన ముఖ్యమంత్రి ఇప్పుడు సమీక్షతో సరి పెట్టుకోవాల్సిందే. ఎన్నికల సంఘం సైతం కేబినెట్ అనుమతి పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని..సాయంత్రానికి తీసుకుంటామని చెబుతోంది. సాయంత్రానికి అనుమతి వచ్చినా కేబినెట్ నిర్వహణ మాత్రం సాధ్యం అయ్యేలా లేదు..
కేబినెట్ నిర్వహణ లేనట్టేనా...
ఎన్నికల సంఘంతో ఒక రకంగా యుద్దం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలోనూ కేబినెట్ సమావేశం నిర్వహించాల్సిందేనని నిర్ణయించారు. దీని కోసం ఆయన పది రోజులకు పైగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే...ప్రధాని కేబినెట్ నిర్వహించినప్పుడు తనకు మాత్రమే నిబంధనలు ఎందుకు అడ్డు వస్తాయని సీఎం ప్రశ్నిస్తున్నారు. ఏపీలో అధికారుల బిజినెస్ రూల్స్ పైనా చర్చించాలనే భావనతో సీయం కేబినెట్ సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందు కోసం తొలుత ఈనెల 10న తేదీన సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, సీఎం కార్యాలయం నుండి కేబినెట్ నిర్వహణ పైన నోట్ అధారంగా సీఎస్ అధికారులతో సమీక్షించారు. కోడ్ ఉల్లంఘించకుండా అజెండా రూపొందించారు. అయితే, కేబినెట్ అనుమతి ఇవ్వాలంటే 48 గంటల సమయం ఈసీకి కావాలని చెప్పటంతో..కేబినెట్ సమావేశాన్ని ఈనెల 14వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇప్పటికీ..ఎన్నికల సంఘం నుండి అనుమతి రాకపోవటంతో..కేబినెట్ సమావేశం ఇక దాదాపు జరిగే అవకాశాలు లేవని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికలసంఘం చెబుతుందేంటి..
ఈనెల 10వ తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. సీఎస్ అధ్యక్షత స్క్రీనింగ్ కమిటీ ఆమోదించిన అజెండాతో పాటుగా కేబినెట్ నిర్వహణకు అనుతి కోరారు. ఇదే లేఖను సీఈవో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. దీని పైన కేంద్ర ఎన్నికల సంఘం సైతం స్పందించింది. తమ వద్దకు ఏపీ సీఈవో నుండి కేబినెట్ నిర్వహణకు అనుమతి కోరుతూ లేఖ వచ్చిందని ధృవీకరించారు. అయితే, అనుమతి ఇవ్వటం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని..సాయంత్రం లోగా తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సాయంత్రానికి అనుమతి వచ్చినా..రేపు మంత్రివర్గ సమావేశానికి అందరూ హాజరు కావటం..సమావేశం నిర్వహించటం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం పైన ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణల కారణంగానే అనుమతి ఆలస్యం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.
సమీక్షతో సరి పెట్టుకోవాల్సిందే..
ఎన్నికల సంఘం నుండి తమ పైన తీవ్ర ఆరోపణలు చేస్తన్న ఏపీ ముఖ్యమంత్రి దూకుడుకు బ్రేక్ వేయాలనే లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ఈ రకంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 10వ తేదీ పంపిన అభ్యర్దనకు 13వ తేదీకి అనుమతి ఇవ్వకపోవటం వెనుక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆలస్యమే అని కామెంట్ చేస్తున్నారు. అయితే, 13వ తేదీ అంటే ఈరోజు సాయంత్రానికి అనుమతి ఇచ్చినా..అది సమావేశం 14వ తేదీ సమావేశం నిర్వహణకు సహకరించదని చెబుతున్నారు. దీంతో..కేబినెట్ సమావేశం కోసం ప్రతిపాదించిన నాలుగు అంశాల పైన అధికారులతో సమీక్ష చేయటం ద్వారా సీఎం చంద్రబాబు సరి పెట్టుకోవాల్సిందే. అనుమతి ఇచ్చినా.. మరో రోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే సాంకేతిక ఇబ్బందులు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.