ఇంగ్లీష్ మీడియం వద్దన్న వాదనల్లో అంటరానితనం- హోదా పోరాటం సాగుతోంది- జగన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో ఇవాళ జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ తన ప్రసంగంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం తన ప్రభుత్వం తీసుకుంటున్న వాది వాదనల్లో డొల్లతనాన్ని, ద్వేషాన్ని జగన్ స్వాతంత్ర దినోత్సవ వేదిక ద్వారా బయటపెట్టారు. అదే సమయంలో రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. 14 నెలల పాలనలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను గుర్తు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగణంగా తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జగన్ ఏకరువు పెట్టారు.

జగన్ కీలక ప్రసంగం...
జాతి యావత్తు 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాజ్యాంగ స్ఫూర్తి అమలవుతుందా లేదా అన్న దానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో పలు విషయాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు వాటి స్ఫూర్తిని అమలు చేయడంలో ఎలా వ్యవహరించాలో గుర్తుచేశారు. అలాగే తన ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలతో పాటు ఇతర హక్కులు ప్రజలకు అందించేందుకు చేస్తున్న కృషిని జగన్ ప్రస్తావించారు. అదే సమయంలో ప్రజలకు, భావితరాలకు మేలు చేసేందుకు తాను చేపట్టిన పలు కార్యక్రమాలను విపక్షాలు ఎలా అడ్డుకుంటున్నాయో కూడా జగన్ వివరించారు.

ఇంగ్లీష్ మీడియం వ్యతిరేక వాదనల్లో అంటరానితనం..
జగన్ తన ప్రసంగంలో రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ను ప్రస్తావించారు. ఇందులో ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరమన్నారు. అయితే విద్యాపరమైన అంటరానితనం ఇంకా పాటించాలన్న వాదనలు మాత్రం రాష్ట్రంలో మరో రూపంలో వినిపిస్తున్నాయని జగన్ గుర్తు చేశారు. మా పిల్లలను, మనవళ్లను ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తాం, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదన్న వాదనల్లో రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తోందని జగన్ కీలక విమర్శలు చేశారు. దీన్ని ఎలా సమర్ధించుకోగలమని విపక్ష పార్టీలు, ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకులను ఉద్దేశించి జగన్ సూటిగా ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్ల తర్వాత కూడా ఇంగ్లీష్ మీడియం పేదలకు అందుబాటులోకి రాకపోతే రాజ్యాంగంలో చెప్పిన సమానావకాశాలు ఎవరికోసం అన్న భావం ప్రబలుతుందన్నారు.

హోదా పోరాటం కొనసాగుతోంది..
పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా అమలు చేయాలని ఎప్పటికీ కోరుతూనే ఉంటామని జగన్ తెలిపారు. కేంద్రం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్ధితి లేదని, కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం లేకపోయినా భవిష్యత్తులో హోదా సాధించగలమన్న నమ్మకం ఉందని సీఎం జగన్ తెలిపారు. ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటామన్నారు. అంటే హోదా విషయంలో తాము గత వైఖరికే కట్టుబడి ఉన్నామని, అయితే భవిష్యత్తులో పరిస్ధితులు మారతాయని ఆశిస్తున్నట్లు జగన్ చెప్పకనే చెప్పారు.
Recommended Video

మ్యానిఫెస్టోలో లేని 39 పథకాలు అమలు..
గత ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో హా్మీలను నెరవెర్చేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ మరోసారి చెప్పారు. మ్యానిపెస్టోలో మొత్తం 129 హామీలు ఇచ్చామని, అందులో ఇప్పటికే 83 నెరవేర్చామని, మరో 30 హామీలు ప్రారంభోత్సల తేదీల కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. అంటే 90 శాతం హామీలు అమలులోకి రావడమో, అమలుకు సిద్ధంగా ఉండటమో ఏడాది పాలనలో జరిగిందన్నారు. ఇంకా అమలు కావాల్సిన హామీలు 16 మాత్రమే ఉన్నాయని, వాటిని కూడా రాబోయే రోజుల్లో అమలు చేసి తీరుతామనని జగన్ వెల్లడించారు. మ్యానిఫెస్టోలో లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 39 పథకాలు అమలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications