గవర్నర్ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!
అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం అని మళ్లీ కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల దగ్గరి నుంచి ఏ ఉద్యోగానికి అయినా కొన్ని నిబంధనలు ఉంటాయని బుచ్చయ్య చౌదరి తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిబంధనలు చూపకుండా అర్హతల గురించి చెప్పకుండా గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోందని విమర్శించారు.
విడతలవారీగా పెన్షన్ పెంచుతామని చెప్పి ఏదో సాధించామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ చెక్కులకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉందనీ, ఆ చెక్కులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీ ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, ఎప్పుడు తెస్తారో చెప్పాలని నిలదీసారు. వైసీపీ కార్యకర్తలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున.. 11 వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ తీరు పొద్దెరగని కొత్త బిచ్చగాడి రీతిలో ఉందని దుయ్యబట్టారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ప్రాథమ్యాలు, నవరత్నాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యంగా గవర్నర్ ప్రసంగిచారు. మా ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉందని,నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తామని గవర్నర్ అన్నారు.విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం.అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం.ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం.
ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ చేపడతాం వీటి కోసం జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తాం.నవరత్నాల అమలు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది.రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. విభజన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications