గుడివాడలో అనుకున్నది సాధించిన TDP!!
అత్యంత ఉద్రిక్త పరిస్థితులు, పోలీసుల ఆంక్షల మధ్యే తెలుగుదేశం, జనసేన నేతలు గుడివాడలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రంగా వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఏజీకే స్కూలు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పూలమాలలు వేశారు.
అనంతరం రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో తమ పార్టీ నేతలపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరింది కొడాలి నాని మనుషులేనని ఆయన ఆరోపించారు. 25 సంవత్సరాల నుంచి గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తుంటే ఇప్పుడు వైసీపీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఏ ఒక్క సామాజికవర్గానికో చెందిన వ్యక్తి వంగవీటి రంగా కాదని, ఆయన అందరివాడన్నారు. రౌడీయిజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా అని, కొడాలి నాని రూ.5వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. ఆయన్ను త్వరలోనే గుడివాడ నుంచి తరిమి కొడతామని, పట్టణంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామన్నారు.
సోమవారం ఉదయం నుంచే పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగా వర్థంతి నిర్వహించేందుకు ఇరు పార్టీలు ఏర్పాట్లు చేయడంతో గుడివాడలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టడంతోపాటు భారీ సంఖ్యలో మొహరించారు. పోలీసుల ఆంక్షల మధ్యే టీడీపీ నేతలు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు శరత్ టాకీస్ వద్ద వైసీపీ నేతలు రంగా వర్థంతిని నిర్వహించారు. గుడివాడలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడదంటూ చెదరగొడుతున్నారు.