ఆ విష సంస్కృతి మీదే కదా చంద్రబాబూ!: విశాఖ ఘటనపై ఏకిపారేసిన జీవీఎల్ నర్సింహారావు
విజయవాడ: విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులను రోడ్లపై అడ్డుకునే విష సంస్కృతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీనే అని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబూ.. మీరు విశాఖ కంటే దారుణంగానే చేశారు..
రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి చంద్రబాబే కారణమంటూ మండిపడ్డారు. తాజా విశాఖ ఘటన కంటే.. గతంలో టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గతంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. మోడీ గోబ్యాక్ అంటూ చంద్రబాబు నల్ల చొక్కా వేసుకున్నారని.. అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారని గుర్తు చేశారు.

ప్రధానినే గోబ్యాక్ అన్నారు.. అమిత్ షా కాన్వాయ్ రాళ్లు..
జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఏపీకి వచ్చినప్పుడు టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు జీవీఎల్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రన్న రాజ్యాంగం అమలులో ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో వైఎస్ జగన్, విజయసాయిని కూడా అడ్డుకున్నారుగా అంటూ చురకలంటించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అయినా ఓ నేతపై కోడిగుడ్లతో దాడి చేయడం సరైన సంస్కృతి కాదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

టీడీపీ, వైసీపీలు భ్రష్టు పట్టిస్తున్నాయి..
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా స్థలాలు ఎలా పంచుతారు? అని వైసీపీ సర్కారును ప్రశ్నించారు. 73 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులతో మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

కర్నూలులో హైకోర్టుపై కేంద్రమంత్రిని కలుస్తా..
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలుస్తామని జీవీఎల్ తెలిపారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపైనా జీవీఎల్ స్పందించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని, అల్లర్లను పోలీసులు సమర్థవంతంగా ఆపగలిగారని తెలిపారు.












Click it and Unblock the Notifications