మూడు రాజధానులు బాగానే ఉంది కానీ..: సీఎం జగన్కు జీవీఎల్ నర్సింహారావు కీలక సూచనలు
అమరావతి: ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఒకే చోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాబివృద్ధి జరగదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని తెలిపారు.

జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం.. కానీ..
రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్ చెప్పారు. అయితే, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని జీవీఎల్ అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

టీడీపీ పట్టించుకోలేదు..
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు బేఖాతరు చేశారని విమర్శించారు. నిపుణుల కమిటీనే కేంద్రం నియమించిందని, ఆ కమిటీ సూచనలు పట్టించుకోకుండా చంద్రబాబు మంత్రి నారాయణ కమిటీ నియమించి ఆయన కమిటీ ప్రకారం రాజధానిని నిర్ణయించారని అన్నారు. ఒకే చోట రాజధాని నిర్మాణంతో అభివృద్ధి జరగదని అన్నారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు మరో చోట ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాదని అన్నారు.

జగన్ సర్కారుకు జీవీఎల్ సూచనలు..
శివరామకృష్ణ కమిటీ సూచనలను మరోసారి పరిశీలించాలని జీవీఎల్ ఏపీ ప్రభుత్వాన్ని సూచించారు. అమరావతిలో ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి అమరావతిని కేవలం లెజిస్లేచర్ క్యాపిటల్ చేయడం మాత్రమే కాకుండా అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకు పరిమితం చేయవద్దన్నారు. రాజధానిపై రాజకీయ, సామాజిక కోణంలో చూడటం సరికాదని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నేతలపై ఆరోపణలున్నాయని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఈ విషయంపై స్పష్టత నివ్వాలని అన్నారు.

మూడు రాజధానులంటూ జగన్ ప్రకటన
మంగళవారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఏపీ రాజధాని అంశంపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది కదా అని అన్నారు. అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్ర జరుగుతుందని అన్నారు. అలాగే అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications