రాజకీయం రావొద్దంది..సినిమా సాగనంపింది..వివాదాలు వెల్కం అంటున్నాయి.!వాజీ వాజీ వాజీ.. ఏందీ గజిబిజి..?
అమరావతి/హైదరాబాద్ : మొదట టీవీ షోలు., తర్వాత సినిమాలు.. ఆ తర్వాత హీరోగా గుర్తింపు.. తర్వాత రాజకీయాలు.. ఆ తర్వాత ఊహించని వివాదాలు.. ఇదీ తెగుగు హీరో శివాజీ ప్రస్థానం. రాష్ట్రం విడిపోయాక ప్రత్యేక హోదా రాగం అందుకున్న శివాజి ఆ పోరాటంలో ఎంతవరకు విజయం సాధించారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమం, ఏపి రాజకీయాలతో ముడిపడ్డ శివాజి ప్రయాణం ఎన్నో ఆసక్తికర మలుపులు తిసుకుంది. ఒకానొక సమయంలో ఏపి రాజకీయాల్లో ఏం జరగబోతోందో, రాజకీయ నాయకులకు ఎలాంటి పరిణామాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయో జోస్యం చెప్పే స్థాయికి ఎదిగారు శివాజి.
గరుడ శివాజీ చుట్టూ వివాదాలు..! తప్పించుకునే మార్గం ఉందా..?
దేశంలో రాజకీయ ఆదిపత్యం కోసం కొన్ని శక్తులు ఆపరేషన్ గరుడ పేరుతో దక్షిణ భారతాన్ని ఎలా శాసించ బోతున్నాయో విశ్లేషించి సంచలనం సృషించారు శివాజి. అప్పటి నుంచి ఆయనకు గరుడ శివాజీగా ముద్రపడిపోయింది. హీరో శివాజీ కి బదులు గరుడ శివాజీగా సంభోదించడం మొదలుపెట్టారు ఏపి రాజకీయ నేతలు. అయితే ఆతర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు శివాజీని సమస్యల్లోకి నెట్టాయి. తన మిత్రుడు రవిప్రకాశ్ వివాదాల్లో చిక్కుకోవడం, వాటిలో శివాజీకి భాగస్వామ్యం ఉండడం, ఆతర్వాత శివాజీ పైన లుకౌట్ నోటీసులు, కనిపిస్తే అరెస్టు వారెంట్ల వరకూ వ్యవహారం వెళ్లింది. ప్రస్తుతం శివాజీ అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూర మయ్యారు. హీరో శివాజీ అలియాస్ గరుడ శివాజీ భవిశ్యత్ ఏ మలుపులు తీసుకోనుంది..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కలిసి రాని రాజకీయం..! పారని ప్రత్యేక హోదా పాచిక..!!
పాతికేళ్ల క్రితం ఓ కుర్రాడు నర్సరావుపేట నుంచి హైదరాబాద్ చేరాడు. మంచి రూపం.. ఆకట్టుకునే ముఖవర్చస్సు.. స్వరం అంతా బాగానే ఉన్నాయి. చిన్నాచితకా వేషాలు వేస్తున్నపుడు బ్యాచిలర్స్తో హీరో అయ్యాడు. క్రమంగా హిట్లు.. ఫట్లూ చవిచూస్తూ మంచి కామెడియన్ హీరోగా ఎదిగాడు. రాజేంద్రప్రసాద్ తరువాత అంతటి కామెడీ పండించే హీరో శివాజీ అనుకున్నారు. కానీ.. ఇక్కడే ఓవరాక్షన్తో మాస్ ఇమేజ్ కోసం పాకులాడిన శివాజీ ప్లాప్ హీరోగా మిగిలాడు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా ఎదిగేందుకు అవకాశం ఉన్నా రాజకీయ జూదంలో చిక్కాడు. అటువంటి వేళ రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఏపీ ప్రత్యేకహోదా లో తటస్త నాయకుడిగా తెరంగేట్రం చేశాడు మేధావుల సంఘ నేత చలసాని శ్రీనివాసరావు వలలో ఇరక్కుపోయాడు. అక్కడ రాజకీయాలు. తెరచాటు వ్యవహరాలు తెలుసుకోలేకపోయాడు. చలసాని శ్రీనివాసరావు దెబ్బతో శివాజీకి షాక్ తగిలినంత పనయ్యింది.
వివాదాల సుడిగుండాలు..! శివాజీ మునుగుతారా..! తేలుతారా..?
ఆ తరువాత చంద్రబాబు నాయుడుకు సహాయకుడిగా తెరవెనుక చక్రం తిప్పటంలో నిమగ్నమయ్యాడు. దీనికి టీవీ9 సంపూర్తి మద్దతు ప్రకటించింది. గుట్టుగా తమకు అందే సమాచారాన్ని శివాజీ ద్వారా బహిర్గతం చేశారు. ఇటువంటి సమయంలో చంద్రబాబును దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందంటూ గరుడ పురుణం తెరమీదకు తెచ్చాడు. తనకు తెలిసి చెప్పినా.. తెలియకుండా స్పందించినా ఎన్నికల ముందు జగన్పై హత్యాయత్నం నిజంగానే జరిగింది. టీడీపీ గెలిచినట్టయితే.. శివాజీకు కిరీటం దక్కేది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో శివాజీ కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం కూడా జగన్పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. జగన్ కూడా తనపై జరిగిన హత్యాయత్నం కేసును సీరియస్గా తీసుకున్నారు. దీనిపై తనకు సమాచారం ఉందని చెప్పిన శివాజీని కూడా కేసులో విచారించే అవకాశం ఉందనేది తెలుస్తోంది.
ఎంత కాలం అంధకారం..! ఎప్పుడు ప్రజా జీవితం..?
ఇదిలా ఉంటే. టీవీ9 షేర్ కొనుగోళ్లలో రవిప్రకాశ్తో వివాదాలు కోర్టు గడప తొక్కాయి. ఈ నేపథ్యంలోనే టీవీ9 యాజమాన్యం మారటంతో ఇది పోలీసుల వరకూ చేరింది. రవిప్రకాశ్, శివాజీపై కేసులు నమోదయ్యాయి. దీనిపై రవిప్రకాశ్ మొదట్లో తనను మినహాయించాలని ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు తప్పనిసరిగా పోలీసు విచారణకు వెళ్లాలని ఆదేశించటంతో వెళ్లొచ్చాడు. కానీ శివాజీ మాత్రం నెలల తరబడి తప్పించుకుంటూ తిరుగుతున్నాడని పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. ఇటువంటి సమయంలోనే అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో శివాజీ నుంచి పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి దుబాయ్ లో పట్టుబడటంతో చర్చనీయాంశమైంది. మున్ముందు శివాజీ భవితవ్యం ఎలా ఉంటుందనేది ప్రశ్నార్ధకమైంది.