ఏపీలో కోటి దాటితే రివర్స్ టెండరింగ్- సర్కారు కీలక నిర్ణయం -టీడీపీ నెత్తిన మరో పిడుగు..
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని నిత్యం ఆరోపణలు చేస్తున్న విపక్ష టీడీపీని మరింత ఇరుకున పెట్టేలా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అప్పగించి పూర్తి చేయని పనుల్లో కోటి రూపాయలు దాటితే చాలు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది అధికారంలోకి రాగానే వంద కోట్ల రూపాయల విలువైన పనులను న్యాయసమీక్ష తర్వాతే కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత పలు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు ఆదా చేసినట్లు ప్రకటించింది.
జగన్ మరో కీలక నిర్ణయం...
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలను పరుగులు తీయిస్తున్న ప్రభుత్వం వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతోంది. ఖజానా ఖాళీగా ఉన్నా లెక్కచేయకుండా సీఎం జగన్ పథకాలన్నీ అమలు కావాల్సిందేనని డెడ్లైన్లు పెట్టేస్తున్నారు. దీంతో అధికారులు కూడా బెంబేలెత్తుతున్న పరిస్ధితి. అయితే అదే సమయంలో ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న మరో నిర్ణయం ఇలాంటిదే. ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బు ఆదాకావడంతో పాటు విపక్ష టీడీపీ నేతలకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.
కోటి దాటినా రివర్స్ టెండరింగ్...
ఒకప్పుడు ప్రభుత్వం కోటి రూపాయల పనులు కేటాయించడమంటే పెద్ద విషయం. ఇప్పుడు గ్రామాల్లో రోడ్డు వేయాలన్నా కనీసం కోటి రూపాయల బడ్జెట్ ప్లాన్ రెడీ అయిపోతోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం వంద కోట్ల పైబడిన పనుల్లో అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని కోటి రూపాయలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేటాయించిన పనుల్లో కోటి రూపాయలు దాటిన వాటిలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు కావు. గత టీడీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చి ప్రారంభించిన పనులే. వీటిలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రివర్స్ టెండరింగ్ ఇందులోనే...
తాజాగా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటిలోనూ కోటి దాటిన పనుల్లో రివర్స్ టెండరింగ్ తప్పదు. ఈ ఆదేశాలు కూడా తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు దాటిన పనులన్నింటిలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు.. అలా చేయకపోతే బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తామని కూడా హెచ్చరించారు. దీంతో కోటి రూపాయల పేరు చెబితేనే ప్రభుత్వ అధికారులు బెంబేలెత్తాల్సిన పరిస్ధితి నెలకొంది.
Recommended Video
టీడీపీ నేతలకు చుక్కలు...
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న తాజా కోటి రూపాయల పనుల రివర్స్ టెండరింగ్ నిర్ణయం విపక్ష టీడీపీని టార్గెట్ చేసేందుకే అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు తాజాగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయంతో వారి నెత్తిపై మరో పిడుగు పడినట్లయింది. అంతే కాదు రివర్స్ టెండరింగ్ నిర్వహించకపోతే బిల్లులు ఆపేస్తామన్న ప్రకటన ఇప్పుడు కాంట్రాక్టర్ల భవిష్యత్తును కూడా అగమ్య గోచరంగా మార్చబోతోంది. గతంలోలా కోట్ల రూపాయలు వెనకేసుకునే పరిస్ధితి లేకపోగా చేసిన పనులకు కూడా బిల్లులు రాబట్టులేకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం క్షేత్రస్ధాయిలో సంచలనం రేపుతోంది.